2018 నుంచే నెయ్యి కల్తీ ? వైసీపీ భారీ ట్విస్ట్ -కొత్త విచారణ వేళ..!
ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత వైసీపీ హయాంలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని, ఇందులో జంతుకొవ్వు, పందికొవ్వుకలిశాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చింది. ఇందులో నెయ్యి కల్తీ అయిందని, అయితే ఏ కొవ్వూ కలవలేదని తేల్చేసింది. దీంతో తాము చెప్పిందే నిజమైందని వైసీపీతో పాటు కూటమి పార్టీలు కూడా వాదనలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ఇవాళ సిట్ రిపోర్ట్ పై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై వైసీపీ (ysrcp) ఘాటుగా స్పందించింది.
సిట్ రిపోర్ట్ పై ప్రభుత్వ విచారణా ?: వైసీపీ
నెయ్యి కల్తీపై సీబీఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్ పై ప్రభుత్వం తిరిగి విచారణ కమిషన్ నియమించడాన్ని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. నెయ్యిలో కల్తీ లేదా అని ప్రశ్నిస్తున్నారని, ఈ సిట్ విచారణ 2019-24 మధ్య కాలానికి వేశారని తెలిపారు. ఇందులో నిందితులుగా తేలిన ప్రీమియర్ డెయిరీ 2013 నుంచి 2024 వరకూ నెయ్యిని అనేకసార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసిందని, మీకు నిజంగా తిరుమల శ్రీవారి మీద భక్తి ఉంటే, మీ గత ప్రభుత్వంలో సరఫరా అయిన నెయ్యిపైనా విచారణ చేయించాలని కోరారు. ఆ రోజు 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా చేసిన డెయిరీయే మా హయాంలోనూ సరఫరా చేసిందన్న విషయం గుర్తుచేశారు.

2018 నుంచే నెయ్యి కల్తీ ?
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2018, ఆగస్టు 27న టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం 87 వేల కేజీల నెయ్యిని కొనుగోలు చేసిందని, నెయ్యికి ఆ వాసన తీసుకొచ్చేందుకు ఆవు నెయ్యి ఫ్లేవర్ను కలిపిన నెయ్యిని రోజుకు 975 కేజీల చొప్పున కొనుగోలు చేశారని తెలిపారు. ఆ రోజున వాడిన నెయ్యి కల్తీ నెయ్యి కాబట్టే వాసన రాలేదని, అందుకే ఏకంగా రూ.3.75 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫ్లేవర్ కలిపారని ఆరోపించారు. అప్పుడు దీనికి అనుమతి ఇచ్చిన టెక్నికల్ కమిటీలో అధికారులే తమ హయాంలోనూ కొనసాగారని వెల్లడించారు. వీళ్లంతా నెయ్యిని కొనాలని నిర్ణయించి, పలమనేరుకు చెందిన పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి నుంచి కేజీ నెయ్యి రూ.385 చొప్పున కొనుగోలు చేశారన్నారు. 2018 ఆగస్టు 28న చేసిన టీటీడీ తీర్మానం 374 ఇందుకు నిదర్శనమన్నారు.

2014 నుంచీ సీబీఐ విచారణ కోరండి
2014 నుంచి ఇదే సీబీఐ దర్యాప్తు వేయించే ధైర్యం మీకు ఉందా? అని ప్రభుత్వాన్ని భూమన ప్రశ్నించారు. టీటీడీని రాజకీయ పావుగా వాడుకోకపోతే మీ హయాంలోనే నెయ్యి సరఫరా చేసిన వాళ్లు, కొనుగోళ్లు చేసిన వాళ్ల మీద విచారణ చేయించాలన్నారు. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ దోషి అంటున్నారని, సిట్ ఏర్పాటు చేశాక జంతుకొవ్వు విమర్శలు చేసిన మీరు ఆయన్ను రెండోసారి ఎందుకు ఈవోగా నియమించారని ప్రశ్నించారు. నెయ్యి పేరుతో అనిల్ సింఘాల్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారన్న అనుమానాలు వస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ పదే పదే నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేప నూనె వాడారని దుష్ప్రచారం చేశారని, వారు ఆరోపించినట్టు ఆ నెయ్యిలో అవేవీ లేవని తేలిపోయిందన్నారు. అయినా ఇంకా ఎదురుదాడి చేస్తూ, గత వైసీపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ హయాం నుంచే జరుగుతున్న నెయ్యి కల్తీపై విచారణ చేయించమని కోరారు.












Click it and Unblock the Notifications