తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. నాలుగోరోజు సర్వభూపాల వాహనంపై స్వామివారు..
కళియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నాలుగో రోజు సాయంత్రం తిరుమల శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో తిరుమాడ విధులలో ఊరేగుతారు. ఇక, ఇదే రోజు శ్రీ మలయప్ప స్వామి వారు ఉదయం కల్పవృక్ష వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
కల్పవృక్షం క్షీర సాగర మధనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో ఒకటి. దీని నీడన చేరిన వారికి ఎలాంటి లోటు ఉండదని పురాణాలు చెబుతున్నాయి.ఇక, ఇదే రోజున సాయంత్రం శ్రీమలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంలో భక్తులను కనువిందు చేయనున్నారు. కల్పవృక్షవాహనం ఉదయం 8గంటల నుంచి 10 గంటల వరకు ఉండగా, సర్వభూపాల వాహనం రాత్రి 7గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజనం కార్యక్రమం ఉంటుంది.

సర్వభూపాల అంటే...
రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థమని పురాణాలు చెబుతున్నాయి. అంటే మలయప్పస్వామివారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని అనే భావం వస్తోంది.
ఉత్తరానికి కుబేరుడు, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. వీరి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా శ్రీవారు ప్రజలకు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications