తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి, చంద్రబాబు సంతాపం
హైదరాబాద్: చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ సోమవారం మృతి చెందారు. ఆయన 2004, 2014లలో తిరుపతి శాసన సభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1947 మార్చి 1న జన్మించారు. ఆయన వయస్సు 67. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
వెంకటరమణ గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. కొద్ది రోజుల క్రితం అస్వస్థత కలగడంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం ఆయన కోలుకున్నారు. తిరిగి ఇటీవల మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు.

దీంతో అతనిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నాలుగైదు రోజులుగా ఆయన ఆసుపత్రిలోని ఐసీయూలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన 2014లో టీడీపీ నుండి పోటీ చేసి తిరుపతి నుండి గెలుపొందారు. ఆయన గతంలో తుడా చైర్మన్గా చేశారు.
షాకింగ్ న్యూస్: బొజ్జల
వెంకటరమణ మృతి పట్ల మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన అందరితోను కలిసిపోయేవారని చెప్పారు. వెంకటరమణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్, బొజ్జల, రామ్మోహన్ నాయుడు, ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బాలకృష్ణ, పల్లె రఘునాథ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తదితరులు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications