పసిడి ధరలు మళ్లీ పైపైకి: 2 రోజుల్లో ఎంత పెరిగిందంటే?: విజయవాడ, విశాఖల్లో గోల్డ్ రేట్స్ ఇవే
విజయవాడ: బంగారం ధరలు మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. కొన్ని రోజులుగా క్షీణిస్తూ వచ్చిన బంగారం రేట్లలో వరుసగా మూడు రోజులుగా పెరుగుదల కనిపిస్తోంది. వెండి ధరల్లోనూ అదే తరహా పురోగమనం నెలకొంది. బంగారం ధరల్లో రెండురోజుల వ్యవధిలో 190 రూపాయల మేర పెరుగుదల నమోదైంది. కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరల్లో నమోదవుతూ వచ్చిన మహా పతనం.. ఒక స్థాయికి వచ్చేటప్పటికి నిలిచిపోయాయి. మళ్లీ స్వల్పంగా పైకి ఎగబాకడం ఆరంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటోన్న మార్పుల వల్లే బంగారం ధరల్లో హెచ్చు, తగ్గులు చోటు చేసుకుంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బుధవారం నాటి బులియన్ మార్కెట్లో నమోదైన వివరాల ఆధారంగా చూస్తే.. బంగారం ధరల్లో 10 రూపాయల పెరుగుదల కనిపించింది. మంగళవారం నాడు 120, 180 రూపాయల మేర పెరుగుదలను నమోదు చేసుకుంది. మరో రోజు గడిచేసరికి నామమాత్రంగా 10 రూపాయల మేర పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఈ రెండురోజుల్లో 120 రూపాయల మేర పెరిగింది. విజయవాడ బులియన్ మార్కెట్లో 10 గ్రాములకు 54,210 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధరలో 190 రూపాయల పెరుగుదల రికార్డయింది. దీని ధర విజయవాడలో 10 గ్రాములకు 49730 రూపాయలుగా నమోదైంది.
హైదరాబాద్, విశాఖపట్నంలల్లో ఇవే రేట్లు నమోదు అయ్యాయి. వెండిలోనూ ఇదే తరహా పురోగతి కనిపించింది. కిలో ఒక్కింటికి వెండి ధర ఈ రెండు రోజుల్లో 2110 రూపాయలు పెరిగింది. 68710 రూపాయల వద్ద నిలిచింది. కొద్దిరోజులుగా కొనసాగుతోన్న ధరల పతనాన్ని ఇది అడ్డుకుందనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతోంది. వాటి ధరలు మళ్లీ ఏ స్థాయిలో పెరుగుతాయనేది అంచనా ఇప్పుడిప్పుడే అంచనా వేయలేమని చెబుతున్నాయి. ఇదివరకు గరిష్ఠంగా 57 వేల రూపాయల వరకు బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. అక్కడి నుంచి రేట్లు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి.
Recommended Video
అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలను బట్టి చూస్తే.. ఇంతకుముందు నమోదైన క్షీణత మరిన్ని రోజుల పాటు కొనసాగుతుందనే అంచనాలు బులియన్ మార్కెట్లో వెలువడ్డాయి. బంగారం ధరల పతనం ఆరంభమైన రోజులను పరిగణనలోకి తీసుకుంటే.. అంతర్జాతీయ మార్కెట్లో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదని చెబుతున్నారు. అయినప్పటికీ.. వాటి రేట్ల పతనం స్తంభించిపోవడం మళ్లీ పెరుగుదలలో గ్రీన్ మార్క్ కనిపించడం కొత్త విశ్లేషణలకు ఆస్కారం ఇచ్చినట్టవుతుందని అభిప్రాయపడుతున్నారు.