భారత్ కా తిరంగా.. కభీ ఝుకేగా నహీ: న్యూయార్క్ వీధుల్లో అల్లు అర్జున్
అమరావతి: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు అరుదైన గౌరవం లభించింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఇండియా డే పరేడ్కు ఆయన సారథ్యాన్ని వహించారు. న్యూయార్క్లో ఈ ర్యాలీ ఏర్పాటైంది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మన్హట్టన్లల్లో నివసించే భారతీయులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది. అల్లు అర్జున్తో పాటు ప్రఖ్యాత గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ సహా చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. కిందటి నెలలోనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నాలుగో పరేడ్ కౌన్సిల్ భేటీ సందర్భంగా అల్లు అర్జున్ను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ర్యాలీలో పలువురు ప్రవాస భారతీయులు పాల్గన్నారు. అసోసియేషన్ ఛైర్మన్ అంకుర్ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడారు. హిందీలో ఆయన మాట్లాడటం ఆకట్టుకుంది. పుష్పలోని ఫేమస్ డైలాగ్.. ఝుకేగా నహీ.. అంటూ ఉత్సాహ పరిచారు. భారతీయుడిగా జన్మించడం పట్ల గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత శక్తిమంతమైనదిగా అభివర్ణించారు.
ప్రతిష్ఠాత్మక ర్యాలీకి గ్రాండ్ మార్షల్గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల రెండు, మూడేళ్లుగా దీన్ని నిర్వహించట్లేదు. ఇప్పుడా పరిస్థితులు లేకపోవడం వల్ల మరింత గ్రాండ్గా ఈ ర్యాలీని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ గ్రాండ్గా చేపట్టింది. మన్హట్టన్లోని మ్యాడిసన్ అవెన్యూ మీదుగా ర్యాలీ కొనసాగింది. దీనికి గ్రాండ్ మార్షల్గా అల్లు అర్జున్ వ్యవహరించారు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ తరువాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ అటు ఓవర్సీస్లో భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రెండు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసింది. ఇప్పుడిక ఆయన దీని సీక్వెల్లో నటించాల్సి ఉంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత పుష్ప 2 సెట్స్ మీదికి వెళ్తారని తెలుస్తోంది.