ramgopal varma-ys jagan : జగన్ తో రాంగోపాల్ వర్మ రహస్య భేటీ-ఆ స్ధానం భర్తీ చేస్తారా ?
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో టాలీవుడ్ దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ ఇవాళ భేటీ అయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వర్మ.. రహస్యంగా ఆయనతో భేటీ అయ్యారు. చివరి నిమిషం వరకూ ఈ విషయం ఎవరికీ తెలియకుండా సస్పెన్స్ గా ఉంచారు.
గతంలో ఏపీ ప్రభుత్వంతో సినిమా టికెట్ల వివాదంలో చర్చలు జరిపిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఏ విషయంపై జగన్ తో చర్చలు జరిపారనే దానిపై క్లారిటీ లేదు. గతంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్నినానితో ట్విట్టర్ వార్ తర్వాత ఆయన్ను సచివాలయానికి వచ్చి నేరుగా కలిసిన వర్మ.. ప్రభుత్వానికి టాలీవుడ్ వాదన వినిపించారు. అంతకుముందే ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడం ద్వారా వైసీపీకి రాజకీయంగా మేలుచేసిన చరిత్ర కూడా వర్మకు ఉంది. దీంతో ఇప్పుడు వర్మ జగన్ తో భేటీ అయి ఏ విషయంపై చర్చించారన్న దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వైసీపీలో గతంతో పోలిస్తే టాలీవుడ్ హవా కూడా తగ్గిపోయింది. పృధ్వీరాజ్ వంటి వారు వైసీపీని వీడిపోయారు. అలీ, పోసాని వంటి వారు పదవులు దక్కక దూరంగా ఉండిపోతున్నారు. చిరంజీవి టాలీవుడ్ తరఫున ఇన్నాళ్లూ చర్చలు జరిపినా తాజాగా తన మద్దతు పవన్ కేనని కుండబద్దలు కొట్టేశారు. దీంతో వైసీపీకి టాలీవుడ్ మద్దతు క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మను చేరదీయడం ద్వారా రాబోయే ఎన్నికల్లో సినీ గ్లామర్ ను వాడుకోవడం లేదా వైసీపీకి అనుకూలంగా సినిమాలు తీయించే ప్లాన్ ను జగన్ అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇరువర్గాలు ఓ క్లారిటీ ఇస్తేకానీ అసలు విషయం తెలిసేలా లేదు.