శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..! మోడీ టూర్ ఎఫెక్ట్..!
ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీశైలం మల్లిఖార్జునుడి దర్శనానికి ప్రధాని మోడీ ఈ నెల 16న రాబోతున్నారు. అదే రోజు శ్రీశైలంలో జీఎస్టీ 2.0 సంస్కరణలపై సదస్సు కూడా నిర్వహించనున్నారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు.
ఈ నెల 16వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా శ్రీశైలం వైపు వెళ్లే రహదారులపై తాత్కాలిక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షెరాన్ ఇవాళ వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా అక్టోబర్ 16న ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు శ్రీశైలం వైపు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమయంలో హైదరాబాద్ నుండి శ్రీశైలం వైపు ప్రయాణించే భక్తులు, అలాగే దోర్నాల మార్గం ద్వారా శ్రీశైలం చేరుకునే యాత్రికులు తమ పర్యటన ప్రణాళికలను తగిన విధంగా సవరించుకోవాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి పర్యటన అనంతరం సాధారణ వాహన రాకపోకలు పునరుద్ధరించబడతాయని వారు తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ భక్తులందరినీ ఈ మేరకు సహకారం అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications