విరిగి పడ్డ రైలు బోగీ: తప్పిన ప్రమాదం, ప్రయాణికుల ఆందోళన
రాజమండ్రి: స్పెషల్ ప్యాసింజర్ రైలు బోగీ విరిగి పడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ ప్యాసింజర్ రైలు ఉంగుటూరు సమీపంలోకి రాగానే బోగీ ఒకటి నిట్టనిలువుగా చీలి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఒక్కసారిగా బోగీ విరిగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో రైలు ప్రయాణికులు కొంత మంది బస్సులో వెళ్లిపోయారు.
ప్యాసింజర్ రైలుతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విరిగిపడిన బోగీని పక్కకు తొలగించి రైళ్ల రాకపోకలకు వీలు కల్పించారు. ఈ ఘటన కారణంగా ఆ రైలు మార్గంలో రెండు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.