మచిలీపట్నం, దుగ్గరాజపట్నాలకు మహర్ధశ. ఏపీ తీరానికి రూ.వేల కోట్లు!
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మార్చేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగా హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ సీఎండీ రియర్ అడ్మిరల్ చంద్రశేఖరన్ రఘురాం గురువారం సీఎం నారా చంద్రబాబు నాయుడితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో తీరప్రాంత ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, బ్లూ ఎకానమీకి బూస్ట్ ఇవ్వడంపై ఇద్దరి మధ్య అత్యంత ఫలప్రదమైన చర్చలు జరిగాయి.
మచిలీపట్నం, దుగ్గరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డులు!
రాష్ట్రంలో నౌకా నిర్మాణ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు మచిలీపట్నం, దుగ్గరాజపట్నం ప్రాంతాల్లో ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ షిప్యార్డులు అత్యంత కీలకమని హెచ్ఎస్ఎల్ ప్రతినిధులు వెల్లడించారు. హెచ్ఎస్ఎల్ భవిష్యత్ విస్తరణకు ఇవి ఊపిరిగా మారడమే కాకుండా, దేశీయంగా నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనకు ఈ ప్రాజెక్టులు ఒక మైలురాయిగా నిలవనున్నాయి.

18 లక్షల పనిదినాల ఉపాధి.. యువతకు మహర్దశ!
ఈ ప్రతిపాదనల ద్వారా రాష్ట్రంలో నౌకా నిర్మాణం, షిప్ రిపేర్, అనుబంధ పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాలలో ఏకంగా 18 లక్షల పనిదినాలకు తగిన భారీ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సముద్ర రంగంలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను పెంపొందించి, గ్లోబల్ వర్క్ఫోర్స్గా తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.
ఎంఎస్ఎంఈలకు రూ. 2,000 కోట్లకు పైగా వ్యాపారం!
స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా ఈ విస్తరణ పెద్ద పండగలా మారనుంది. ఫ్యాబ్రికేషన్, విడిభాగాల తయారీ, అవుట్ ఫిట్టింగ్, సప్లై చైన్ రంగాల్లో పనిచేసే స్థానిక పరిశ్రమలకు రూ. 2,000 కోట్లకు పైగా వ్యాపార అవకాశాలు అందనున్నాయి. దీనివల్ల ఏపీకి చెందిన చిన్న తరహా కంపెనీలు నేరుగా దేశీయ నౌకా నిర్మాణ సరఫరా వ్యవస్థలో ప్రధాన భాగస్వాములుగా మారే అవకాశం దక్కుతుంది.
బ్లూ ఎకానమీతో రాష్ట్ర ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి!
రాష్ట్రంలో సమగ్ర సముద్ర పారిశ్రామిక వ్యవస్థను రూపుదిద్ది, భారీగా వ్యూహాత్మక పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ సముద్ర ఆర్థిక కేంద్రంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని హెచ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. హెచ్ఎస్ఎల్ చేపడుతున్న ఈ బృహత్తర కార్యాచరణ పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.




Click it and Unblock the Notifications