Machilipatnam Port: మచిలీపట్నం పోర్టుపై ఏపీ మంత్రి గుడ్ న్యూస్..!
ఏపీలో ప్రస్తుతం కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్రాజెక్టుల్లో మచిలీపట్నం పోర్టు కూడా ఒకటి. ఈ పోర్టు నిర్మాణాన్ని ప్రస్తుతం శరవేగంగా చేపడుతున్న ప్రభుత్వం ఇవాళ తాజా అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. కృష్ణాజిల్లాలో ఇవాళ ఎంపీ బాలశౌరితో కలిసి పర్యటించిన ఆయన ఈ మేరకు బందరు పోర్టుపై ప్రకటన చేశారు.
మచిలీపట్నం పోర్టు ఏడాదిలో పూర్తి కాబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. దాదాపు రూ.400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు ఎక్కడ ప్లైఓవర్, అండర్ పాసులు ఉండాలో అధికారులు ప్రణాళికలు వేస్తున్నారని, మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇందుకోసం రూ. 2వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామన్నారు.

అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా ప్రతిపాదన చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడ నుంచి గోశాల వరకు రోడ్డు విస్తరణ చేయాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో పాటు కృష్ణాజిల్లాలోని పలు రహదారులపైనా అప్ డేట్ ఇచ్చారు. పెడన, గుడివాడ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హైవేకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు. కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి 350 కిలోమీటర్లు ఉంటుందని, దీనికి తీర ప్రాంత గ్రామాలు తాళ్లపాలెం, గిలకలదింది, కోడూరు ప్రాంతాలను కలపాలని ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు తెలిపారు. అలాగే పామర్రు నుంచి చల్లపల్లి రోడ్డును పీఎం గతి శక్తి ద్వారా అభివృద్ధి చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications