ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. యువకుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య.. ఒకరు మృతి, మరొకరు సీరియస్
ప్రేమ గుడ్డిది అని అందరూ అంటుంటారు. కానీ కొన్ని సార్లు ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు పిచ్చిది కూడా అని అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా ఈ కోవకే చెందుతోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించడమే కాకుండా.. పెళ్లి చేసుకోవాలంటూ ఇద్దరు యువతులు ఒత్తిడి తెచ్చారు. అందుకు ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఒకరు మృతి చెందగా.. మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకోగా.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఇద్దరు యువతుల్లో ఒకరికి అల్రెడీ పెళ్లి జరగడం మరింత షాక్ కి గురి చేస్తోంది.
ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బత్తలపల్లి మండలం గరిసినపల్లెకు చెందిన దివాకర్ డిగ్రీ పూర్తి చేసి అనంతపురం లోనే వాహనాలకు లోన్లు ఇచ్చే సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇన్స్టాగ్రామ్ లో ముదిగుబ్బకు చెందిన షేక్ రేష్మాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు.

కానీ రేష్మా భర్తను వదిలేసి నెల రోజులకే సొంత ఊరికి వచ్చేసి మళ్లీ దివాకర్ను కలవడం ప్రారంభించింది. మరోవైపు దివాకర్ తన చెల్లి స్నేహితురాలు, కణేకల్లు మండలం యర్రగుంటకు చెందిన శారదతో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఆమె ప్రస్తుతం అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతూ గుల్జార్ పేటలోని ఓ హాస్టల్లో ఉంటోంది. ఈమెను కూడా వీలున్నప్పుడు ప్రేమను కొనసాగిస్తున్నాడు దివాకర్.
అయితే దివాకర్ తనతో పాటు శారదను కూడా ప్రేమిస్తున్నట్టు రేష్మా గుర్తించింది. ఇదేంటని దివాకర్ను ప్రశ్నించగా.. గత కొద్ది రోజులుగా ఈ విషయం పైనే వారి ముగ్గురి మధ్య గొడవ జరుగుతోంది.ఈ క్రమంలోనే ముగ్గురు మరోసారి సమావేశం అవ్వగా ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవాలని దివాకర్ ను కోరారు. అందుకు అతను నిరాకరించడమే కాకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన యువతులు మోసపోయామని భావించారు.
వెంటనే నగరంలోని ఆర్టీవో కార్యాలయం ఆవరణలోకి వెళ్లి ఇద్దరు యువతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్థానికులు గమనించి వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శారద చనిపోగా.. రేష్మా పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. యువతుల కుటుంబ సభ్యులా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దివాకర్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications