టిని అడ్డుకునేందుకే మోడీతో బాబు: హరీశ్ రావు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ .. తెలంగాణను అడ్డుకునే కుట్రలో భాగంగానే చంబ్రాబు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రివాల్ తనకు ఆదర్శమంటున్న చంద్రబాబు, ఆయనలా కాకుండా బిజెపి పొత్తు కోసం ఎందుకు అర్రులు చాస్తున్నారని విమర్శించారు.
స్వయం ప్రకాశం లేని చంద్రుడిలా.. చంద్రబాబు రాజకీయాలు ఉన్నాయని హరీశ్ రావు అన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబుకు, నీతి నిజాయితీలు లేవని విమర్శించారు. వెన్నుపోటు రాజకీయ చరిత్ర చంద్రబాబుదని ఆయన అన్నారు. 2002లో గుజరాత్లోని గోద్రాలో అల్లర్ల తర్వాత ఏన్డిఏ నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు మళ్లీ ఎందుకు బిజెపితో పొత్తుకు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని గద్దె నుంచి దించండని అప్పటి ప్రధాని వాజ్పాయికి లేఖ రాసిన చంద్రబాబు, లేదంటే తన ఏన్డిఏ కన్వీనర్ పదవి నుంచి వైదొలగుతానని చెప్పారని అన్నారు. మరి ఇప్పుడు మోడీ సెక్యూలర్ నాయకుడు అయ్యారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా 2003లో హైదరాబాద్ నగరానికి నరేంద్ర మోడీని రాష్ట్ర బిజెపి ఆహ్వానిస్తే.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు మోడీ రాకను అడ్డుకున్నారని తెలిపారు.
ప్రస్తుతం మోడీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు బాబును ఆహ్వానిస్తే.. మతతత్వ పార్టీతో పొత్తు ఉండదని చెప్పిన చంద్రబాబు, మళ్లీ ఏ ముఖం పెట్టుకుని బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చూస్తున్నారని అన్నారు. గతంలో మోడీని తిట్టిన చంద్రబాబు, ఇప్పుడు మోడీని ప్రసన్నం చేసుకునేందుకు బిజెపి చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. పదవి కోసం గడ్డి తినడానికి కూడా చంద్రబాబు వెనుకాడరని అన్నారు. పచ్చి రాజకీయ వాది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు.
బిజెపిని మతతత్వ పార్టీ అని ముద్ర వేసిన చంద్రబాబును ఆ పార్టీ ఇప్పుడు ఎలా చర్చించుకుంటుందని అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన చంద్రబాబు, తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందని తెలిసినా అసెంబ్లీకి రాలేదని ఆరోపించారు. గతంలో తెలంగాణను అడ్డుకున్నది తానేని గుంటూరు పర్యటనలో చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలో భాగంగానే చంద్రబాబు బిజెపితో పొత్తుకు పాకులాడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు.