టిఆర్ఎస్ నాయకుల సంబరాలు: వెళ్లిపోయిన పొన్నాల
హైదరాబాద్: ఇప్పటి వరకు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి అత్యధిక సీట్లలో ఆధిక్యం రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ నివాసానికి భారీగా పార్టీ కార్యకర్తలు చేసుకుని సంబరాలు జరుపుకుంటున్నారు.
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారావు నృత్యాలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ పార్టీ కార్యకర్తలు, నాయకులు టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. టిఆర్ఎస్ పార్టీ 65 అసెంబ్లీ స్థానాల్లో ఆధక్యంలో కొనసాగుతోంది. ఇందులో మూడు స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు ఘన విజయం సాధించారు. ఆలేరు టిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత, భువనగిరి టిఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి ఫైలా శేఖర్ రెడ్డి విజయం సాధించారు. కాగా, శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి గెలిచిన అభ్యర్థులందరూ తెలంగాణ భవన్ కు రావాలని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కోరినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులతో మాట్లాడినట్లు తెలిసింది.
కాగా, తెలుగుదేశం పార్టీ 13, భారతీయ జనతా పార్టీ 6, ఎంఐఎం పార్టీ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కేవలం 13 స్థానాల్లోనే ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నిస్తేజం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మినిష్టర్స్ క్వార్టర్స్ నుంచి వెళ్లిపోయారు. పొన్నాల తన నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. మరో మాజీ మంత్రి శ్రీధర్ బాబు కూడా వెనుకుంజలోనే కొనసాగుతున్నారు. మాజీ మంత్రి గీతారెడ్డి ఓటమిపాలయ్యారు.