లోక్సత్తా ఏక్సత్తానే, మనిషా.. పశువా?: జెపిపై తెరాస
హైదరాబాద్: లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్పల్లి శాసన సభ్యులు జయప్రకాశా నారాయణ పైన తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు బుధవారం భగ్గుమన్నారు. తెలంగాణ రావడం తెరాసకు ఇష్టం లేదన్న జెపి వ్యాఖ్యలపై వారు ఆయనను నిలదీశారు. "ఆయన మనిషా.. పశువా? అది నోరా.. మోరీనా?''అంటూ చెలరేగిపోయారు. మీడియా పాయిం ట్లో ఎదురు దాడికి ప్రయత్నించారు. జెపి సూడో మేధావని, వితండవాదం చేస్తున్నారని ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు.
రాష్ట్రం ఏర్పడినా, ఏర్పడకపోయినా తెలంగాణకు ఒరిగేదేమీ లేదని గతంలో అన్నారని, మేధావే అయితే ఆ మాటకు కట్టుబడి ఉండాలని ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ఇలానే వ్యవహరిస్తే ప్రజలు పాతాళంలో పాతరేస్తారని ధ్వజమెత్తారు. సోమాజిగూడలో నివసించే జెపి కూకట్పల్లి నుంచి ఎందుకు పోటీ చేశారు? అక్కడ ఆయన ప్రాంతం, సామాజిక వర్గం ఓట్లేస్తారనే గదా? అని మాజీమంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రశ్నించారు.

చిన్న రాష్ట్రాలవల్ల పరిపాలన సౌలభ్యం ఉంటుందని, వికేంద్రీకరణ జరుగుతుందన్న ఇంగితం ఆయనకు లేదా అని దుయ్యబట్టారు. జెపి మాటలకు, చేతలకు పొంతన లేదని, మైకు తీసుకుని గంటలకొద్దీ మాట్లాడడం గొప్ప కాదని, నీళ్లు నిధుల విషయంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే చిత్తశుద్ధి ఆయనకు లేదన్నారు.
మీడియా పాయింట్ వద్ద జెపి మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన తెరాస ఎమ్మెల్యేలు ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. జై తెలంగాణ, లోక్సత్తా అదో ఏక్సత్తా, దొంగ సత్తా.. మరోమారు బుద్ధి చెప్పాలా? అప్పుడు మల్లేష్ చేసిన శాస్తి మళ్లీ చేయాలా? అది గుర్తుకు లేదా? అంటూ నినాదాలు చేశారు. వారి వ్యాఖ్యలపై జెపి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉందని కొందరు మంచికి, మరికొందరు చెడుకు ఉపయోగించుకుంటారన్నారు.
జెపి సభలోకి వెళ్తుండగా వారు అడ్డుకున్నారు. తెలంగాణ వద్దంటారా అని ప్రశ్నించారు. దానికి ఆయన తాను తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. తెరాసకు రావడం ఇష్టం లేదని ఎందుకున్నారని ప్రశ్నించారు. జెపి సమాధానం ఇచ్చేలోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రావడంతో సద్దుమణిగింది.
జెపిపై గులాబీ నేతల విసుర్లపై లోక్సత్తా పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. తమను విమర్శించే ఏ పార్టీ నాయకుడైనా దమ్ముంటే తన కంచుకోటను వదిలి రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేసి గెలవాలని, విభజనను అడ్డుకుంటేనే తమకు ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని తెరాస భావించడం నిజమని, ఉన్నమాట జెపి అన్నందుకే ఆయనపై అక్కసు ప్రదర్శిస్తున్నారని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు కటారి శ్రీనివాస రావు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications