టీవీ చానెళ్లపై బ్యాన్: జవదేకర్పై తెరాస మండిపాటు
హైదరాబాద్: ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవి 9 చానెళ్ల ప్రసారాల నిలిపివేసినందుకు ఎంఎస్వోలపై చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన హెచ్చరికపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మండిపడింది. తెరాస పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి ప్రకాష్ జవదేకర్ను కలిసి కౌంటర్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ చానెళ్లు వి6, టీ న్యూస్ ప్రసారాలను నిలిపేశారని ఆయన ఆరోపించారు. ప్రసారాల నిలిపివేతను ఎవరు ప్రారంభించారని అడుగుతూ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్వోలు ఆ పద్ధతిని ప్రారంభించారని ఆయన ఆరోపించారు.

మొదట టీన్యూస్ ప్రసారాలను నిలిపేసి, ఆ తర్వాత వి6 ప్రసారాలను ఆపేశారని ఆయన చెప్పారు. భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ వర్తిస్తుందని, అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా వర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు.
ప్రసారాల నిలిపివేతలో తెలంగాణ ప్రభుత్వ పాత్ర లేదని, ఓ చానెల్ ప్రసారం చేసిన బుల్లెట్ న్యూస్ వ్యతిరేకంగా, కించపరిచే విధంగా ఉండడంతో ఎంఎస్వోలు మనస్తాపానికి గురయ్యారని జితేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఆ రెండు చానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని అడుగుతున్న టిడిపి, బిజెపి నాయకులు ఆంధ్రప్రదేశ్లో టీన్యూస్, వి6 ప్రసారాలను పునరుద్ధరించాలని జితేందర్ రెడ్డి అన్నారు .
వి6, టీన్యూస్ ప్రసారాల నిలిపివేత గురించి విన్నప్పుడు ప్రకాష్ జవదేకర్ తనకు ఈ విషయం తెలియదే అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమస్తే తెలంగాణ పత్రిక ప్రతులను తగులబెట్టిన విషయం కూడా తనకు తెలియదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications