వైఎస్ అవినాష్ కు దక్కని ఊరట-అటు పులివెందులో సీబీఐ వెయిటింగ్ ?
ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ .. వేగంగా అడుగులేస్తోంది. దీంతో ఏ క్షణమైనా తనను అరెస్టు చేయొచ్చన్న అనుమానంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన ప్రత్యర్ధిగా మారిన పిటిషనర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టు గడప తొక్కి తెలంగాణ హైకోర్టు ఆదేశాల్ని నిలిపివేయించారు. ఈ నేపథ్యంలో అవినాష్ అరెస్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది.
నిన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారభించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ తమకు ఇంకా అందలేని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. దీంతో మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేసింది. అప్పటికీ తీర్పు కాపీ లభించకపోవడంతో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఈ నెల 25 వరకూ అంటే ఇవాళ్టి వరకూ ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల్ని సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో జరగాల్సిన విచారణ కూడా వాయిదా పడటంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ తెలంగాణ హైకోర్టులో రేపటికి వాయిదా పడటంతో ఆయన పులివెందులకు చేరుకున్నారు. అక్కడ ప్రజాదర్బార్ నిర్వహించారు. అదే సమయంలో సీబీఐ అధికారులు కూడా పులివెందులలోనే మకాం వేశారు.హైకోర్టు ఉత్తర్వులు అనుకూలంగా వస్తే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. హైకోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వకపోతే మాత్రం దర్యాప్తులో లీనం కానున్నారు.












Click it and Unblock the Notifications