వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వు-సీబీఐ విచారణలో జోక్యానికి నిరాకరణ
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన సీబీఐ విచారణలో వీడియోగ్రఫీకి అవకాశం కల్పించాలని చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది.
ఏపీలో నాలుగేళ్ల క్రితం కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మూడుసార్లు సీబీఐ ఆయన్ను విచారించింది. అయితే సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న రిట్ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
ఈ సందర్భంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న సీబీఐ విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎంపీ అవినాష్రెడ్డి రిట్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ని విచారించిన సమయంలో రికార్డ్ చేసిన ఆడియోలు, వీడియోలను సీబీఐ సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. 35 మంది సాక్షుల స్టేట్మెంట్లు, 11 సీడీలు, హార్డ్ డిస్క్ లను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు.

మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ జరుపుతున్న విచారణలో వీడియో రికార్డింగ్ అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది.ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రేపు విచారణ వద్దు అనుకుంటే సీబీఐనే ఆశ్రయించాలని అవినాష్ రెడ్డికి హైకోర్టు సూచించింది. ఈ దశలో సీబీఐ విచారణలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే తీర్పు వెల్లడించే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో ఈ మేరకు వైసీపీ ఎంపీకి ఊరట దక్కినట్లయింది.












Click it and Unblock the Notifications