టీటీడీ పాలకమండలి నిర్ణయాలు- ఇకపై.. !!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు సమావేశమైంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటైన ఈ సమావేశానికి ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు, కార్యనిర్వాహణాధికారి అనిల కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి దీనికి హాజరయ్యారు. పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారిందులో.
టీటీడీ ఆధీనంలోని అన్ని ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేయడానికి పలమనేరులో 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచాలని నిర్ణయించారు. ధ్వజస్తంభాలు, రథాలను తయారు చేయడానికి ఇక్కడి వృక్షాల ద్వారా వచ్చిన కలపను వినియోగిస్తారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించానికి అదనంగా రూ.48 కోట్లు మంజూరుకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.

టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు, అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ముంబైలోని బాంద్రాలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కోసం ఆర్కిటిక్ట్ నియామించాలని బోర్డు తీర్మానించింది.
దాతల కాటేజీల నిర్వహణ, నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావడం, తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ పనులలో భాగంగా రెండవ దశలో రూ.14.10 కోట్లు మంజూరు చేయడం వంటి నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2,100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 సీట్లు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి పోటులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోటు సూపర్వైజర్ పోస్టులను క్రియేట్ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదించాలని బోర్డు నిర్ణయించింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలు, తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో జాతీయ సంస్తృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ డీ ప్రభాకర్ కృషమూర్తిలతో కమిటీ ఏర్పాటయింది. శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటు, నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదించింది.
తిరుమల, కాలిబాటలో ఉన్న పురాతన ప్రాశస్త్యం గల నిర్మాణాల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో డేస్కాలర్లకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది. తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయం నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది.
టీటీడీ అనుబంధ ఆలయాలలో పని చేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఇందులో అర్చకులకు రూ.25,000 నుండి రూ. 45,000, పరిచారకులకు రూ. 23,140 నుండి రూ. 30,000, పోటువర్కర్లకు రూ. 24,279 నుండి రూ. 30,000, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు రూ. 23,640 నుండి రూ. 30,000 కు పెంచాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications