శ్రీకృష్ణదేవరాయ కాలం నుంచి ఆభరణాలు భద్రం: టీటీడీ ఈవో, రమణదీక్షితులు ఆరోపణలపై ఆధారాల సేకరణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంపై చేసిన ఆరోపణలు, విమర్శలపై ఈవో ఏకే సింగాల్ స్పందించారు. రమణ దీక్షితుల ఆరోపణలు తిప్పికొట్టేందుకు రెండు రోజులుగా ఆధారాలు సేకరించారు. అనంతరం ఆదివారం రమణదీక్షితులు ఆఱోపణలను తిప్పికొట్టారు.
శ్రీవారి ఆలయంలో స్వామివారి కైంకర్యాలు, పూజలు శాస్త్రోక్తంగా, ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయని తెలిపారు. 1971 నుంచి సుప్రభాత సేవలు ఉదయం మూడు గంటలేక ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఆగమ శాస్త్రాలు అంగీకరిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పూజా కైంకర్యాలను లైవ్ టెలికాస్ట్ చేస్తామని చెప్పారు.

శ్రీకృష్ణ దేవరాయం కాలం నుంచి ఉన్న ఆభరణాలు భద్రం
శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి నేటి వరకు భక్తులు సమర్పిస్తున్న నగలన్నీ ఎంతో భద్రంగా ఉన్నాయని సింఘాల్ చెప్పారు. ఆభరణాల భద్రతపై చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే రెండుసార్లు రిటైర్డ్ జడ్జిలతో టీటీడీ విచారణ జరిపించిందని తెలిపారు.1952లో తిరు ఆభరణం రిజిస్టర్లో నమోదైన ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని వాద్వా కమిటీ తెలిపిందన్నారు. ఆగమ శఆస్త్రాలు అంగీకరిస్తే ఆభరణాలను భక్తుల సందర్శనార్థం ఉంచుతామన్నారు.

అది డైమండ్ కాదు, రూబీ
జస్టిస్ జగన్నాథ రావు కమిటీ నివేదికలోనే 2001లో పగిలిపోయింది డైమాండ్ కాదని, రూబీ అని పేర్కొందని సింఘాల్ చెప్పారు. పగిలిపోయిన రూబీ ముక్కలు ఇప్పటికీ టీటీడీ ఆధీనంలోనే ఉన్నాయని తెలిపారు. ఆలయంలో రహస్యంగా ఏమీ జరగడం లేదన్నారు. మరమ్మత్తుల విషయంలో భక్తులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, అన్నింటి విషయంలో వాస్తవాలను భక్తులకు చెప్పాలని ముందుకు వచ్చామన్నారు. పన్నెండేళ్ల కోసారి వచ్చే మహా సంప్రోక్షణ సమయంలో గర్భగుడిలోను మరమ్మత్తులు జరుగుతాయన్నారు.

వారి స్థానంలో కుటుంబ సభ్యులకే అవకాశం
ఆగమ శాస్త్రంలో అధికారుల ప్రమేయం ఉండదని సింఘాల్ చెప్పారు. టీటీడీ నిర్ణయాలపై కొందరి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. 2012లోనే అర్చకులకు 65 ఏళ్ల వయో పరిమితి విధానం అమలులోకి వచ్చిందని చెప్పారు. కానీ పదవీ విరమణ తర్వాత కొందరు అర్చకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. నిబంధనల ప్రకారం అర్చకులను తొలగించిన స్థానంలో వారి కుటుంబ సభ్యులనే నియమించామన్నారు.

భక్తులకు సులభ దర్శనమే మా బాధ్యత
ప్రధాన అర్చకులుగా తమకు అవకాశం కల్పించాలని గొల్లపల్లి కుటుంబానికి చెందిన వేణుగోపాల దీక్షితులు కోర్టును ఆశ్రయించారని సింఘాల్ తెలిపారు. మీరాశి వంశీకులకు, బ్రాహ్మణులకు ఎలాంటి అన్యాయం జరగడం లేదన్నారు. అర్హత, ఖాళీలు చూసుకొని అవకాశాలు కల్పించాలని కోర్టు చెప్పిందన్నారు. భక్తులకు సులభంగా దర్శనం భాగ్యం కల్పించడమే తమ బాధ్యత అన్నారు.












Click it and Unblock the Notifications