తిరుమలలో ఆ ఏజెన్సీల అలసత్వం: నాణ్యత రహితం: భక్తులకు తిప్పలు: కమిటీకి ఈవో ఆదేశం
Tirumala: తిరుమలలో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై టీటీడీ అధికారులు దృష్టి సారించారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాదిమంది భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య పనులను చేపట్టడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా కమిటీ వేయాలనీ నిర్ణయించారు.
పారిశుద్ధ్య పనుల నిర్వహణపై టీటీడీ ఈవో జే శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. శ్రీవారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోన్నందున క్యూ లైన్లను ఇతర ప్రాంతాలకు విస్తరించాల్సి వచ్చిందని, అలాంటి చోట్ల తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా ఉండట్లేదని అధికారులు ఈవోకు వివరించారు.

పారిశుద్ధ్య నిర్వహణ కోసం వినియోగించే పరికరాలను కాంట్రాక్ట్ ఏజెన్సీలు సకాలంలో సరఫరా చేయట్లేదని తెలిపారు. నాణ్యత లేని క్లీనింగ్ పరికరాలను అందజేస్తోన్నారని వివరించారు. వీటిపై ఈవో ఘాటుగా స్పందించారు. కాంట్రాక్టర్లను హెచ్చరించాలని, నిబంధనల ప్రకారం సరిపడా సిబ్బంది, మెటీరియల్ సరఫరా చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
తిరుమలలో పరిశుభ్రత చర్యలను మెరుగుపర్చడానికి మూడు రోజుల సమయం ఇవ్వాలని ఆయన జేఈఓలను ఆదేశించారు. అప్పటికీ పనులు మెరుగుపడకపోతే ఆకస్మికంగా తనిఖీలు చేయడానికి సీనియర్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. తదుపరి చర్యలు తీసుకోవడానికి అవసరమైన నివేదిక ఇవ్వాలని చెప్పారు.

ప్రతి రోజూ వేలాది మంది భక్తులు విచ్చేసే తిరుమలలో అపరిశుభ్ర వాతావరణానికి తావు లేదని శ్యామలరావు తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీ పడొద్దని అన్నారు. తిరుమల, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే టీటీడీ బోర్డుకు భక్తుల్లో చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు.
పారిశుద్ధ్య నిర్వహణ విధుల్లో ఉండే సిబ్బంది ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని, హెల్త్ డిపార్ట్మెంట్ను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సమర్థవంతంగా సిబ్బంది పని చేయాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. తిరుమలలో ప్రాంతాలు, షిఫ్ట్ల వారీగా అవసరమయ్యే కార్మికుల జాబితా, సిబ్బంది సమస్యల పరిష్కారానికి సమగ్ర నివేదిక అందజేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications