TTD: శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంపు, బ్లాక్ లిస్టు లో నెయ్యి కాంట్రాక్టర్లు
కలియుగదైవం శ్రీవెకంటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగిందని టీటీడీ ఈవో జే. శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు హెచ్చరించారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారని అన్నారు. ప్రస్తుతానికి అడల్ట్రేషన్ టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదని, త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ముడిసరుకులు, నెయ్యి ప్రొక్యూర్ మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని శ్యామలరావు అన్నారు.

నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని, ఇందులో
ఎన్ డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్, హైదరాబాద్ కు చెందిన డాక్టర్. విజయ భాస్కర్ రెడ్డి, ప్రొసర్ స్వర్ణ లత, బెంగుళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ ఉన్నారని శ్యామలరావు అన్నారు. ఈ కమిటీ వారంరోజులలో నివేదిక అందిస్తారని ఆయన తెలిపారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్ లో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశ నిర్ధేశం చేస్తుందని శ్యామలరావు అన్నారు. నెయ్యికి సువాసన చాలా అవసరమని, వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు.
ప్రస్తుత సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరపరా చేయాలని సూచించాం, కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు, మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయి. ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెటిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబీఎల్ టెస్ట్ లో తేలిందని, శ్రీవారి లడ్డూల విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని టీటీడీ ఈవో జే. శ్యామలరావు అన్నారు.

టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్కు పంపినట్లు శ్యామలరావు తెలిపారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు సరిపోలడం లేదని, చాల తేదాలు ఉన్నాయని శ్యామలరావు అన్నారు.
కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు.
టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టామని, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఆ రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు టీటీడీ ఈవో జే. శ్యామలరావు వివరించారు. తిరుమల శ్రీవారి లడ్డూలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications