తిరుమల కాటేజీల్లో ఇకపై..!!
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 80,193 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 33,298 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.43 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయాలను కల్పించడానికి టీటీడీ.. సరికొత్త కాటేజీ విధానాన్ని రూపొందించబోతోంది. ఈ మేరకు టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు కసరత్తు చేపట్టారు. కొత్త కాటేజీల విధానం ఎలా ఉండాలనే విషయంపై సమీక్ష సైతం నిర్వహించారు.
టీటీడీ పరిపాలన భవనంలో ఈ సమీక్ష ఏర్పాటైంది. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి.. టీటీడీలోని వివిధ విభాగాల అధికారుల ఇందులో పాల్గొన్నారు. కొత్త కాటేజీల విధాన రూపురేఖలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
తిరుమలలో కాటేజీల నిర్వహణ కోసం నూతన విధానాన్ని తయారు చేయాలని శ్యామలరావు అధికారులను ఆదేశించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా దాతలు కాటేజీలు నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి వీలుగా విధాన పరమైన బ్లూ ప్రింట్ ను తయారు చేయాలని అన్నారు.
దాతలకు అందాల్సిన ప్రివిలేజస్, వారికి కల్పించాల్సిన సౌకర్యాలు- నిర్వహణ, గదుల మెయింటెనెన్స్, వాహనాల పార్కింగ్, కాటేజీ డిజైన్లు, వాటిల్లో శ్రీవారి ఫొటో, పెయింటింగ్.. ఇవన్నీకూడా భక్తి భావం ఉట్టిపడేలా ఉండాలని ఈఓ సూచించారు. దీనికి అనుగుణంగా గదులను నిర్మించాలని, దీనికి అవసరమైన ఓ సమగ్ర నివేదికను అందజేయాలని అన్నారు.
నిర్దేశించిన సమయానికి దాతలు కాటేజీలను నిర్మించి టీటీడీకి అప్పగించేలా, దాతలకు కేటాయించిన ప్రివిలేజేస్ దుర్వినియోగం కాకుండా చూడడం, కాటేజీల నిర్మాణానికి దాతల ఎంపిక, విధి విధానాలు, బాధ్యతలు తదితర అంశాలు పారదర్శకంగా ఉండేలా నిబంధనలు రూపొందించాలని చెప్పారు.
తిరుమలలో ప్రస్తుతం గరుడాద్రి, అంజనాద్రి, హిల్ వ్యూ, శంఖుమిట్ట, శేషాద్రి కాటేజీలు అందుబాటులో ఉంటోన్నాయి. అళ్వార్ ట్యాంక్ కాటేజీ, వరాహస్వామి గెస్ట్ హౌస్, హిల్ వ్యూ డీలక్స్ కాటేజీ, ట్రావెలర్స్ బంగళా కాటేజీ, నారాయణాద్రి గెస్ట్ హౌస్, సుదర్శన్, కల్యాణి వంటి పలు ధర్మసత్రాలు ఉన్నాయి.
కాగా.. తాళ్ళపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల్లో నేడు పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించనున్నారు అర్చకులు. అనంతరం ఉదయం 9 గంటలకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం స్వామి వారు, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాల్లో జూలై 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.












Click it and Unblock the Notifications