శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ నిర్ణయాలు..!!
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 76,501 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 29,033 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.39 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి విభాగాధిపతులను ఆదేశించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ సాయంత్రం ఆయన అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆదేశాలను ఇచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. సెప్టెంబర్ 16వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే నెల 23వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 24న ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. 28న గరుడ వాహనం, అక్టోబర్ 1వ తేదీన రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 2న చక్రస్నానంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలను జరుపుతారు.
- బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దయ్యాయి.
- విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం.
- భక్తులకు దర్శన క్యూ లైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం.
- భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ పనులు చేపట్టాలని ఈఓ ఆదేశించారు. గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని సూచించారు.
- భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తారు.
- శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారు
- సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి 9 నుండి 29వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరిస్తారు.
- భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూలు నిల్వ ఉంచుకోవాలని అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి.. అధికారులకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications