టీటీడీ రికార్డుస్థాయి కలెక్షన్లు..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 66,715 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,503 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- నవంబర్లో 20.37 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 113 కోట్ల రూపాయల మేర ఆదాయం అందింది. హుండీ ద్వారా అందే రెవెన్యూ మరోసారి 100 కోట్ల రూపాయలను దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అదే సమయంలో- 97 లక్షల శ్రీవారి లడ్డూలను భక్తులకు విక్రయించినట్లు టీటీడీ పాలక మండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అలాగే- 19.74 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇక 7.31 లక్షల మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
దాదాపుగా రెండు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా టీటీడీకి అందే హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయల మార్క్ను అధిగమిస్తూ వస్తోంది. 2023 ఏప్రిల్లో గరిష్ఠంగా 140 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ తరువాత ఈ సంఖ్యలో హెచ్చు తగ్గులు నమోదవుతున్నప్పటికీ రెవెన్యూ మాత్రం.. ఏ నెల కూడా 100 కోట్ల రూపాయలకు తగ్గట్లేదు.
ఈ ఏడాది జనవరి- రూ.116.46 కోట్లు, ఫిబ్రవరి- రూ. 111.71 కోట్లు, మార్చి- రూ. 118. 49 కోట్లు, ఏప్రిల్- రూ. 101.63 కోట్లు, మే- 108. 28 కోట్లు, జూన్- 113.64 కోట్ల రూపాయల రెవెన్యూ నమోదు చేసింది టీటీడీ. ఈ మొత్తం హుండీ ద్వారా వచ్చిన ఆదాయం మాత్రమే.
300 రూపాయల ప్రత్యేక దర్శనాలు, లడ్డూ అమ్మకాలు, కల్యాణోత్సవం, తోమాల సేవ, సహస్ర దీపాలంకరణ, అంగ ప్రదక్షిణం వంటి వివిధ రకాల ఆర్జిత సేవల టికెట్ల విక్రయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం భారీగా పెరుగుతుంది. ఈ నెలలో కూడా హుండీ ద్వారా 100 కోట్ల రూపాయల రెవెన్యూ అందే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications