TTD: తిరుమలలో వసతి కష్టాలకు చెక్ - గదుల ఖరారు ఇక..!!
Tirumala: తిరుమలలో భక్తులకు ఇక వసతి కష్టాలు తొలగనున్నాయి. పెరుగుతున్న రద్దీకి అను గుణంగా టీటీడీ కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న భవనాల విషయంలో పరిశీలన చేస్తోంది. కొన్ని భవనాలు శిధిలావస్థకు వచ్చిన వాటి స్థానంలో కొత్తవి నిర్మాణం దిశగా ప్రతిపాదన లు సిద్దం చేస్తున్నారు. తిరుపతిలోనూ రెండు భవనాల నిర్మాణం పై గతంలో నిర్ణయించారు. ఇక, వసతి కేటాయింపు విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు.
వసతి కేటాయింపు
తిరుమలలో నిత్యం వచ్చే వేలాది మంది భక్తుల కోసం 7500 గదులు అందుబాటులో ఉన్నాయి. గత పాలక మండలి తిరుమలలోని వసతి సముదాయాల్లో మరమ్మత్తుల కోసం రూ 110 కోట్లు ఖర్చు చేసారు. తాజా పరిశీలనలో తిరిగి ఆ సముదాయాల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. సుదర్శన్ లో 389, గోవర్ధన్ లో 196, కల్యాణ్ సత్రంలో 246 గదుల ఉన్నాయి. వీటిల్లో నీరు లీకు అవ్వటం.. పెచ్చులు ఊడటం వంటి సమస్యలు అధికారులు టీటీడీకి నివేదించారు. దీంతో, తాజాగా టీటీడీ అధికారులు ఈ సమస్య పైన ఫోకస్ చేసారు. శిథిలమైన భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

తాజా నిర్ణయంతో
తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా, వరాహస్వామి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఇక.. తిరుమలకు వచ్చే వీఐపీ భక్తులకు గదుల కేటాయింపు విషయంలోనూ కొత్త పక్రియ అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా చేసిన మార్పుల మేరకు శ్రీవారి దర్శనం టికెట్ కలిగిన వీఐపీ భక్తులకు మాత్రమే తిరుమలలో ఇకపై గదులు కేటాయింపు చేస్తున్నారు. తిరుమలలో ఉన్న గదుల్లో 3500 గదులను సామాన్య భక్తులకు కోసం సీఆర్వో పరిధిలో ఉన్న ఈ గదులను ఆధార్ కార్డు ద్వారా కరెంట్ బుకింగ్ కింద కేటాయింపు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కింద మరో 1,580 గదులను భక్తులకు కేటాయిస్తున్నారు.
వెసులుబాటు
విరాళాలు ఇచ్చిన దాతల కోసం మరో 400 గదులను కేటాయించారు. మరో 450 గదులను టీటీడీ అరైవల్ కోటాలో కేటాయిస్తోంది. ఇక.. మిగిలిన గదులను వీఐపీల కోసం రిజర్వ్ లో ఉంటు న్నాయి. కొత్త విధానం ప్రకారం తిరుమలలో వసతి గదులు పొందాలంటే వీఐపీ భక్తులకు దర్శన టికెట్ తప్పనిసరి చేసారు. ఆధార్ కార్డుతో పాటుగా శ్రీవారి దర్శనం టికెట్ చూపించి పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో వీటిని పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు గదులను త్వరగా ఖాళీ చేస్తుండటంతో ఇతర భక్తులకు కేటాయింపుకు అవకాశం దక్కుతోంది. అదే విధంగా తిరుపతిలో గోవింద రాజుల సత్రంలో 540 గదులు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి. దీంతో, భక్తులకు వసతి సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications