తిరుమలలో ఆ సేవ రద్దు- తేదీలు, కారణాలు ఇవే
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 79,100 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,791 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.52 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- ఈ ఏడాదిలో తిరుమలలో శ్రీవారికి నిర్వహించబోయే పౌర్ణమి గరుడ సేవ పూర్తి వివరాలతో కూడిన క్యాలెండర్ను టీటీడీ అధికారులు విడుదల చేశారు. వివిధ కారణాల వల్ల ఈ ఏడాది మొత్తం మీద మూడు సార్లు ఈ ఉత్సవాలు రద్దయ్యాయి. వాటికి సంబంధించిన తేదీలను వెల్లడించారు.
ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
మే 12వ తేదీన సోమవారం శ్రీవేంకటేశ్వర స్వామివారికి పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తారు. జులై 10వ తేదీన- గురువారం, ఆగస్టు 9న- శనివారం, అక్టోబర్ 7న- మంగళవారం, నవంబర్ 5వ తేదీన- బుధవారం ఆయా వేడుకలు ఉంటాయి. జూన్ 11- బుధవారం, సెప్టెంబర్ 7- ఆదివారం, డిసెంబర్ 4- గురువారం రోజుల్లో పౌర్ణమి గరుడ సేవ కార్యక్రమాలు రద్దయ్యాయి.
ప్రతి సంవత్సరం తిరమలేశుడికి నిర్వహించబోయే జ్యేష్ఠాభిషేకం మూడవ రోజు కారణంగా జూన్ 11వ తేదీన ఈ వేడుకలను నిర్వహించట్లేదు. చంద్రగ్రహణం నాడు శ్రీవారి ఆలయాలన్ని మూసివేయాల్సి రావడం వల్ల సెప్టెంబర్ 7, కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 4 తేదీల్లో పౌర్ణమి గరుడ సేవ ఉండదని టీటీడీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications