తిరుమలలో మహిమాన్విత కార్యక్రమం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 75,782 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,057 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.97 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
రెండు కంపార్టుమెంట్లల్లో..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రెండు కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం..
కాగా- ఈ నెల 15వ తేదీన శ్రీవారి ఆలయంలో మహిమాన్వితమైన కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించడానికి శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు టీటీడీ అధికారులు. ఆ రోజున శ్రీవారి ఆలయంలో సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగిస్తారు. ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తారు. శ్రీవారికి హారతి ఇస్తారు.
దీపాల వెలుగులో..
అఖండం, కులశేఖరపడి, వకుళామాత, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, ధ్వజస్తంభం, విష్వక్సేనులు, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, శ్రీ బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలు వెలిగిస్తారు.
పౌర్ణమి గరుడ సేవ..
తాళ్లపాకవారి అర, బంగారుబావి, భాష్యకారుల సన్నిధి, సభేర, శ్రీయోగనరసింహస్వామి, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పౌర్ణమి గరుడసేవను టీటీడీ అధికారులు రద్దు చేసే అవకాశం ఉంది. ప్రతి పౌర్ణమి నాడు గరుడ సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.
ధనుర్మాసారంభం..
ఆ మరుసటి రోజు నుంచి అంటే 16వ తేదీన ధనుర్మాసం ఆరంభమౌతుంది. ఈ మాసంలో తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాసం ముగిసేంత వరకూ ఈ పాశురాలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణనాన్ని రెట్టింపు చేస్తాయి. 26న సర్వ ఏకాదశి, 29న మాస శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. అదే రోజున తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్ర కార్యక్రమం ఉంటుంది. 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమౌతాయి.












Click it and Unblock the Notifications