TTD: అన్యమత ఉద్యోగులకు టీటీడీ షాక్- తొలి వేటు ఆమెపైనే..!
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ బోర్డు) పరిధిలో అన్యమతస్తులు పనిచేయకుండా తొలగిస్తామని గతంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు టీటీటీ పరిధిలో ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న అన్యమతస్తుల్ని తొలగించే ప్రక్రియను టీడీడీ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ ఓ విద్యాసంస్ధలో ప్రిన్సిపాల్ స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగిని బదిలీ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు ఇచ్చింది.
తిరుమల వెంకన్నకు ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని టీడీడీ పరిధిలో అన్యమత ఉద్యోగులు లేకుండా చూస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో టీటీడీ ఆ మేరకు తమ పరిధిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల్ని బదిలీలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న జి.అసుంతను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అసుంతను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తూ పూజ చేయకుండా, హారతి ఇవ్వకుండా, తీర్థ ప్రసాదాలు తీసుకోని అసుంతపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆమెను డిప్యూటేషన్ పై నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు టీటీడీ తెలిపింది.
టీటీడీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వైఎస్ హయాంలో ఎక్కువ మంది అన్యమత ఉద్యోగుల్ని టీడీడీలో నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరి తొలగింపుకు ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. తాజాగా బీజేపీతో కలిసి అధకారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ మేరకు అన్యమత ఉద్యోగుల తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు టీటీడీ వాటిని అమల్లో పెట్టింది.












Click it and Unblock the Notifications