TTD: మార్చినెలలో వైభవంగా తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు!!
మార్చి నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషమైన పండుగలు, వేడుకలు జరగనున్నాయి. టిటిడి ఆధ్వర్యంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షికబ్రహ్మోత్సవాలు మార్చి నెలలో జరగనున్నాయి. మార్చి 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టిటిడి వెల్లడించింది.
మార్చి 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్య సమయంలో బ్రహ్మోత్సవాలను ప్రారంభించి, ఆపై ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, రాత్రి ఎనిమిది గంటల నుండి 10 గంటల వరకు శేష వాహన సేవలను నిర్వహించనున్నట్టు టీటీడీ పేర్కొంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవలు విశేషాల విషయానికి వస్తే..

మార్చి 16వ తేదీన ఉదయం ధ్వజారోహణం నిర్వహించి, రాత్రి హంస వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. మార్చి 17వ తేదీన ఉదయం ముత్యపు పందిరి వాహనంలో స్వామి విహరిస్తారు. రాత్రి హనుమంత వాహనం పైన స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. 18వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం పైన, సింహ వాహనం పైన స్వామి భక్తులను కరుణిస్తారు.
19వ తేదీ ఉదయం తరిగొండ లక్ష్మీనరసింహస్వామికి ఉదయం తిరుచ్చి ఉత్సవం నిర్వహించి, పెద్దశేష వాహనం పైన స్వామివారిని ఊరేగిస్తారు. ఇక మార్చి 20వ తేదీన ఉదయం తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహించి, రాత్రి గజ వాహనంపై స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. 21వ తేదీ ఉదయం తిరుచ్చి ఉత్సవం తో పాటు రాత్రి సర్వభూపాల వాహనం, గరుడ వాహనంపై స్వామి వివరిస్తారు. అదే రోజు స్వామివారి కల్యాణోత్సవం కూడా జరుగుతుంది.
మార్చి 22వ తేదీన ఉదయం రథోత్సవాన్ని, రాత్రి ధూళి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 23వ తేదీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు వాహనం పైన రాత్రి చంద్రప్రభ వాహనంపైన ఊరేగి ఆ పైన పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్వామి అశ్వవాహనం పైన దర్శనమిస్తారు. 24వ తేదీన స్వామివారికి వసంతోత్సవాన్ని, చక్ర స్నానాన్ని నిర్వహిస్తారు.
24వ తేదీనాడు రాత్రి ధ్వజావరోహణంతో తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మార్చి 25వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పుష్పయాగాన్ని నిర్వహించి ఈ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.












Click it and Unblock the Notifications