తిరుమలలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్
శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమౌతోంది. గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో అధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తోన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు. ఈ క్రమంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకోవడం, వాహన సేవలను తిలకించేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం.
ఈ క్రమంలో తిరుమల నాలుగు మాడ వీధులతోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పకడ్బందీ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులు సౌకర్యవంతంగా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు రానున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, ఎంట్రీ/ఎగ్జిట్ మార్గాల్లో భద్రతా చర్యలు చేపడుతున్నామని వివరించారు. గరుడసేవకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున తిరుమల, తిరుపతిలోని పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీవీఎస్వో తెలిపారు.
అధిక సంఖ్యలో వాహనాలు వచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు సులభంగా మార్గనిర్దేశం చేయడానికి తిరుమల, తిరుపతిలోని ప్రధాన జంక్షన్లల్లో వివిధ భాషల్లో సైన్బోర్డులను ఏర్పాటు చేస్తామని సీవీఎస్ఓ వివరించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోన్నామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తుల భద్రతతోపాటు క్రైమ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్, ఫైర్, ఫారెస్ట్, ఇంటెలిజెన్స్, ఆర్టీసీ, రైల్వే తదితర శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాల సమయంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి పెట్టామని అన్నారు.












Click it and Unblock the Notifications