'ప్రత్యేక' దెబ్బ ఎవరికి?: మోడీకి బాబు చేయి, అంతలోనే.. బిల్లుపై ట్విస్ట్లు
విజయవాడ/న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదాపై ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు అంశం రాజకీయ మలుపులు తిరుగుతోంది. ఇది అంతిమంగా ఎవరిని దెబ్బతీస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ నెల 22వ తేదీన కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు పైన చర్చ, ఓటింగుకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేతలు విపక్షాలు, జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి లేఖ కూడా రాశారు.
మరో రెండు రోజుల్లో బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో బుధవారం నాడు చకచకా పలు ట్విస్ట్లో చోటు చేసుకున్నాయి.
తేల్చేసిన బీజేపీ
కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు చర్చకు రాకపోవచ్చునని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. తాము ఏపీకి ప్రత్యేక హోదా కంటే ఎక్కువే చేస్తున్నామని, అసలు కేవీబీ బిల్లు చర్చకు కూడా రానివ్వమని ఆయన వ్యాఖ్యానించారు. హోదా అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు.
హరిబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెల 22న చర్చకు వస్తుందా అనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం చర్చకు వస్తుందనే తాము పెట్టామని, గత సమావేశాల్లో చేసినట్లు కుట్ర చేయవద్దని సూచించారు.
బాబు మనసు మార్చుకున్నారా?
ప్రత్యేక హోదా బిల్లు పైన తెలుగుదేశం పార్టీ బుధవారం ప్రకటన చేసింది. తాము కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతు పలుకుతామని ప్రకటించింది. అదే సమయంలో ట్విస్ట్ కూడా ఇచ్చింది. అసలు ఉపయోగం లేని బిల్లు అని సంచలన ప్రకటన చేసింది. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా తాము మద్దతిస్తామని ప్రకటించింది.
అయితే, అసలు విషయం మాత్రం వేరే ఉందని అంటున్నారు. ఓ వైపు జాతీయ స్థాయిలో కొన్ని పార్టీలు, చివరకు కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్రత్యేక బిల్లుకు మద్దతు ప్రకటిస్తామని చెప్పింది. ఆ తర్వాత, మద్దతు పైన తెరాస వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అది వేరే విషయం.
మరోవైపు, ఏపీ ప్రయోజనాల కోసం అంటూ కాంగ్రెస్ బిల్లు పెట్టగా, వైసిపి మద్దతిస్తోంది. దీంతో, ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కచ్చితంగా బిల్లుకు మద్దతు పలికేందుకు ముందుకు వచ్చారని అంటున్నారు. చంద్రబాబు నిర్ణయం బీజేపీని ఇరుకున పెట్టేదిగానే కనిపిస్తోందని అంటున్నారు.
'ప్రత్యేక' ఎవరికి దెబ్బ?
విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ పూర్తిగా చతికిల పడింది. విభజన సమయంలో ప్రత్యేక హోదా కోసం బలంగా డిమాండ్ చేసిన బీజేపీ దానిని అమలు చేసే పరిస్థితుల్లో కనిపించడం లేదు.
ఇది ఇటు బిజెపికి, అటు మిత్రపక్షం తెలుగుదేశం చిక్కులు తెచ్చి పెడుతోంది. ప్రజల ముందు ఈ రెండు పార్టీలను దోషులుగా నిలబెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. 'విభజన'తో జరిగిన నష్టాన్ని 'ప్రత్యేక హోదా'తో పూడ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ఈ కారణంగానే ప్రత్యేక హోదా కోసం ప్రయివేటు బిల్లు, దాని కోసం విప్ జారీ చేయడం.. చేస్తోంది. ఏపీ ప్రజల్లో తమ పైన పోయిన సానుభూతిని తిరిగి పొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అదే సమయంలో విభజన సమయంలో ఏ ప్రత్యేక హోదా కోసం అయితే గట్టిగా పొట్లాడి బీజేపీ సానుభూతి సంపాదించుకుందో, అదే హోదాతో కాంగ్రెస్ పార్టీ దెబ్బకొట్టే పరిస్థితి కనిపిస్తోంది. దానికి టిడిపి మద్దతిస్తుండటం గమనార్హం.