జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు...ఒకరికి టికెట్ పై హామీ
పశ్చిమ గోదావరి:మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల చేరికతో జనసేన జోష్ మరింత పెరిగింది. మాజీ ఎమ్మెల్యేలు రాపాక ప్రసాద్, పాముల రాజేశ్వరీకి ఆదివారం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీలో చేరేవారికి ప్రజల్ని కలుపునే శక్తి ఉందా?...లేదా అనేది మాత్రమే తాను చూస్తానని... అంతే తప్ప ఆర్థిక బలాన్ని కాదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి తాను తీసుకోవడానికి కాదని...ఇవ్వడానికే సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.
జనసేన సిద్ధాంతాలను అర్ధం చేసుకుని పార్టీలో చేరడానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా నేడు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాపాక ప్రసాద్కు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే టికెట్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజోలు మాజీ ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ గతంలో వైసిపి అధినేత జగన్ తో భేటీ అయ్యి, తనకు టికెట్ ఖరారు చేయాలని కోరగా జగన్ స్పందించలేదని, ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆయనకు టికెట్ ఖరారు చేసినట్లు చెప్పుకుంటున్నారు.
అయితే రాపాక వైసిపిని వీడటం ఆ పార్టీకి గట్టి దెబ్బేనని తెలుస్తోంది. రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ కి మంచి ఆదరణే ఉన్నట్లుగా తెలిసింది. పైగా ఆయనకు అక్కడ ఉన్నటువంటి ఆదరణ పార్టీలతో సంబంధం లేనిదని...ఆయన ఏ పార్టీ తరుపున పోటీలో ఉన్నా ఆయన గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా జనసేనలో చేరిన పి.గన్నవరం మాజీ ఎంఎల్ఎ పాముల రాజేశ్వరి దేవి కూడా 2019 ఎన్నికలలో పి.గన్నవరం నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు వైసిపి అధినేత జగన్ ను టికెట్ కోరగా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో జనసేనకు జై కొట్టినట్లు తెలిసింది. పవన్ ను పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆమె అనుచరవర్గం చెబుతోంది. ఏదేమైనా ఈ వలసలు ప్రతిపక్ష వైసిపికి గట్టి దెబ్బేనని చెప్పకోవచ్చు.