సూర్యాపేటలో కాల్పులు: ఇద్దరు పోలీసుల మృతి, యుపి ముఠాగా అనుమానం
నల్లగొండ: నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. బస్టాండ్లో బందోబస్తు డ్యూటీలో ఉన్న హోం గార్డులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వారు వెంటనే సీఐకి సమాచారం అందజేశారు. సీఐ వచ్చిన తర్వాత హోం గార్డులు ఆ వ్యక్తిని సోదా చేయడానికి ప్రయత్నించగా అతడు తుపాకీతో కాల్పులు జరిపాడు.
దీంతో కానిస్టేబుల్ లింగయ్య, హోం గార్డు మహేశ్ అక్కడికక్కడే చనిపోయారు. సీఐ మొగిలయ్య, హోం గార్డు కిషోర్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ప్రయాణికుడికి కూడా గాయాలయ్యాయి. అంతకు కొద్దిసేపటికి ముందు కారులో హైదరాబాద్ వస్తున్న దొరబాబు అనే వ్యక్తిపై కూడా ఇద్దరు కాల్పులు జరిపినట్టు తెలిసింది.
గాయపడినవారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కిమ్స్కు తరలించారు. దొంగలు పారిపోయే క్రమంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న కారును అడ్డగించారు. కారులో ఉన్న దంపతులపై కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తాడేపల్లిగూడెంకు చెందిన దొరబాబు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్చంద్, డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాల్పుల ఘటనపై జిల్లా ఎస్పీ ప్రభాకర్రావు మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా హై అలర్ట్ను ప్రకటించాం. సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని, కాల్పులు జరిపింది ఉత్తరప్రదేశ్కు చెందిన దొంగల ముఠాగా అనుమానిస్తున్నామని చెప్పారు.
దొంగలు రివాల్వర్, గన్మెన్ కార్బన్ను ఎత్తుకెళ్లారు. సీఐ మొగులయ్య ఛాతి బాగంలో రెండు బుల్లెట్లు, భుజంలో ఒక బుల్లెట్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుల కోసం పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయని ప్రభాకర రావు చెప్పారు.
కాల్పుల ఘటనలో తన్వీర్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కారును ఎత్తుకెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో లభించిన సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.