'రాజధానిపై జగన్కు నివేదిక', సీఎంలపై సీపీఐ ధ్వజం
హైదరాబాద్/కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై తమ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలో నివేదిక ఇస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బుధవారం అన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన నేతలు వైయస్ జగన్తో మధ్యాహ్నం భేటీ అయ్యారు.
భేటీ అనంతరం ఉమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 5వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎప్పటికప్పుడు ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తోందన్నారు.
దీనిని నిరసిస్తూ కలెక్టరేట్ల వద్ద నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు. విశాఖలో జరిగే మహాధర్నాలో జగన్ పాల్గొంటారన్నారు. రాజధాని భూముల వ్యవహారంపై రైతుల అభిప్రాయాలను జగన్కు వివరించామన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పర్యటించిందన్నారు.
మిగిలిన గ్రామాల్లోను భూముల సేకరణ పైన తమ పార్టీ కమిటీ పర్యటన త్వరలో పూర్తి చేయనుందని తెలిపారు. అనంతరం జగన్కు నివేదిక ఇస్తామన్నారు. భూముల సేకరణలో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. అవసరాన్ని బట్టి రాజకీయ పార్టీలతో అఖిల పక్షం ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, డిసెంబర్ 15వ తేదీలోగా కమిటీలు పూర్తి చేయాలని జగన్ ఆదేశించారని చెప్పారు.
బాబు, కేసీఆర్లపై నారాయణ ధ్వజం
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ కేసీఆర్ల పైన సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. ఇద్దరూ మాయల పకీర్లేనని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినా ప్రజల తలరాత మారలేదన్నారు ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్ని రద్దు చేస్తామన్నారని, కనీ అధికారంలోకి వచ్చాక లక్ష రూపాయలు మాత్రమే అంటున్నారన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అ్యాక ఒక్కపైసా రుణమాఫీ జరగలేదన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 72 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, హామీలు నెరవేర్చనందుకు బాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. సింగపూర్ పర్యటనకు అయిన ఖర్చు కరవు రైతులకు సాయం అందించి ఉంటే బాగుండేదన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు.
ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలి: చాడ
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారు రాజీనామా చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. తెరాస సర్కారు ప్రవేశ పెట్టిన ఆసరా పథకం పించనుదారులను ఆందోళనకు గురి చేసేలా ఉందన్నారు.