రాజమహేంద్రవరాన్ని పాక్ బోర్డర్లా చేశారు: బాబుపై ఉండవల్లి ఫైర్
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని మానసికంగా బలహీన పర్చేందుకే 13 రోజుల పాటు ఆసుపత్రిలో నిర్భందించారని మాజీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసంలో ఉండవల్లి ఆయన్ని పరామర్శించారు.
ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అలాగే ముద్రగడ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఉండవల్లి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరాన్ని పాకిస్థాన్ బోర్డల్లా చేశారని వ్యాఖ్యానించారు.
కోలుకున్న ముద్రగడ.. రాజమండ్రి ఆసుపత్రిలో స్వీట్ల పంపిణీ
దీనివల్ల కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్న ముద్రగడ పద్మనాభానికే మంచి జరిగిందన్నారు. దీక్ష సమయంలో ముద్రగడ విషయంలో చంద్రబాబు ప్రవర్తించిన తీరుని ఆయన తప్పుబట్టారు. దీక్ష సమయంలో ముద్రగడకు టీవీ, ఫోన్, పేపర్ లేకుండా చేశారని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డ ఉండవల్లి... చంద్రబాబును హిట్లర్, ముస్సోలినితో పోల్చారు. హిట్లర్, ముస్సోలినిలు ఉద్యమకారులను అణిచి నిర్వీర్యం చేశారని తెలిపారు. కాగా తుని విధ్వసం ఘటనలో అరెస్టైన కాపు యువకులను ప్రభుత్వం విడదల చేయాలంటూ ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
స్వగ్రామంలో దీక్ష విరమించిన ముద్రగడ: దాసరి, చిరుతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం
ముద్రగడ దీక్ష చేపట్టిన నేపథ్యంలో పోలీసులు తొలి రోజే అయన ఇంటి తలుపులను బద్దలు కొట్టి దీక్షను భగ్నం చేసిన పోలీసులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తుని విధ్వంస ఘటనలో అరెస్టైన 13 మంది కాపు కార్యకర్తలను ప్రభుత్వం బెయిల్పై విడుదల చేయడంతో ఆయన తన దీక్షను విరమించారు.
ముద్రగడ తన దీక్షను విరమించడానికి గాను 14 రోజులు పట్టింది. 14 రోజుల పాటు ఆయన రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగించారు. ఇదిలా ఉంటే ఆరోగ్యపరంగా కాస్త కోలుకోవడంతో సోమవారం నాడు ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు.
ఆసుపత్రి సూపరిండెంట్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం దీక్ష సమయంలో తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వైద్యులను పేరు పేరునా పలకరించి స్వీటు బాక్సులు అందజేశారు. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్య కార్మికులను కూడా పలకరించారు.