వెంకయ్య దొరికారు, వైయస్ చెప్పారుగా: బాబుపై ఉండవల్లి నోట జగన్ మాట
రాజమహేంద్రవరం: కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు పైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. వెంకయ్య మిస్ లీడ్ చేసి దొరికిపోతున్నారన్నారు. అలాగే, కేంద్రం ప్రత్యేక హోదాను పక్కన పెట్టడానికి ఓ కారణాన్ని కూడా ఉండవల్లి చెప్పారు.
నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎలా అనేది మీడియాలో వచ్చిందన్నారు. ఏ రోజు ఎవరు ఎలా మాట్లాడుతున్నదీ అంతా మీడియాలో వస్తోందన్నారు. వెంకయ్య ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దొరికిపోతున్నారన్నారు.
అదే మా తప్పు, ఏపీ ప్రతినిధిని కాకపోయినా, నన్నే తిడతారా: వెంకయ్య
అసలు నిజంగా ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదా అని నిలదీశారు. అవసరం లేనప్పుడు ఆ రోజు రాజ్యసభలో అంత గట్టిగా ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. రెండు నెలల్లో (విభజన సమయంలో, రాజ్యసభలో హోదా కోసం పట్టుబట్టిన సమయంలో) ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆనాడు ఆయన హోదా కసం గట్టిగా నిలదీశారన్నారు.
అన్ని వసతులు ఉన్న హైదరాబాదును తెలంగాణకు ఇచ్చారు కాబట్టి దానికి సమానంగా ఏపీకి ఏమి ఇస్తారని ఆయన అప్పుడు అడిగారని, ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏమిటన్నారు. హోదా పదేళ్లు కావాలని నాడు అడిగిన వ్యక్తి వెంకయ్య అని అందరికీ తెలుసునని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని, వెంకయ్యను అందరు అసహ్యించుకుంటున్నారన్నారు.
అందుకే చంద్రబాబు సీఎం అయ్యారు
రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్రంలో బిజెపి అధికారంలోకి రానుందన్న విశ్లేషణలు, అంచనాలతో ఏపీలోని 13 జిల్లాల ప్రజల్లో కేవలం 5 లక్షల మందికి వచ్చిన ఆలోచనే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిందన్నారు. ఇదే విషయం వైసిపి అధినేత జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. టిడిపికి రాష్ట్రం మొత్తంలో కేవలం ఐదు లక్షల ఓట్లే తమకంటే ఎక్కువ వచ్చాయన్నారు. ఇప్పుడు ఉండవల్లి అదే చెప్పారు.

ఉండవల్లి ఇంకా మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది కాబట్టి, రాష్ట్రంలోనూ బిజెపితో జతకట్టిన టిడిపికి అవకాశమిస్తే ప్రత్యేక హోదాతో పాటు, వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చాలామంది ఆలోచించి, చంద్రబాబుకు ఓటేశారన్నారు. కేవలం ఈ స్వల్ప తేడాయే టిడిపికి అధికారం కట్టబెట్టిందన్నారు.
కొంచెం ఆలోచించి ఓటేసే వారికి చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా, బిజెపి అంటే ఇష్టం లేకపోయినా, ప్రత్యేక హోదా కోసమే వారు అప్పుడు ఆ కూటమికి మద్దతు పలికారన్నారు. ఇప్పుడు వారందరి ఆశలనూ అడియాసలు చేస్తున్నారని, హోదా ఇవ్వకుంటే తదుపరి ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
రాజ్యసభలో జైట్లీ ప్రసంగం విన్న తనకు రక్తం మరిగిపోయిందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
విభజన సమయంలో జరిగిన అన్యాయం కంటే ఏపీకి ఇప్పుడే ఎక్కువ అన్యాయం జరుగుతోందని ఉండవల్లి అన్నారు. విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసిన రోజున రాజధాని నిర్మాణానికి రూ.5లక్షల కోట్లు కావాలని అడిగిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం రూ.3వేల కోట్లు ఇస్తే ఎందుకు సరిపెట్టుకుంటున్నారన్నారు.
జైట్లీ పార్లమెంటు లోపలా, బయటా మాట్లాడుతున్న తీరు ఏపీని అవమానించేలా ఉందన్నారు. చట్టసభల్లో ఇచ్చిన మాటకు విలువ లేనప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎందుకని ప్రశ్నించారు.
వైయస్ చెప్పిన మాట ప్రకారమే..
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఓ సమయంలో ఓ మాట చెప్పారని, అరవై ఏళ్లు దాటిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదన్నారని, ఎన్నికల్లో దిగకుండా, యువతరానికి ఆ బాధ్యతలు అప్పగించాలని చెప్పేవారని, ఆ ప్రకటన రాసిన సమయంలో తాను ఉన్నానని, తాను వైయస్ కలసి దాన్ని తయారు చేశామని, ఆనాటి వైయస్ మాటకు నేను కట్టుబడి ఉన్నానని ఉండవల్లి చెప్పారు.
వెంకయ్యని పవన్ టార్గెట్ చేయడం వెనుక: లడ్డూలకూ కథ
తనకు అరవై ఏళ్లు దాటాయని, ఇక ఎన్నికల రాజకీయాల్లో ఉండనని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేయకున్నా రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు నిత్యం కృషి చేస్తానన్నారు. తనకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు తప్ప మరేం తెలియదన్నారు. ఒకరిని తిట్టడం, మరొకరితో తిట్టించుకోవడం తనకు అలవాటే అన్నారు.












Click it and Unblock the Notifications