ఏపీలో అమిత్ షా టూర్ ఖరారు-8న కర్నూల్లో సభ-పుట్టపర్తిలో బీజేపీ కీలక నేతలతో భేటీ..
ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఒకే రోజు బిజీ బిజీ కార్యక్రమాలతో గడిపేందుకు జనవరి 8న షా ఏపీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు ఆయన కీలక దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే బహిరంగసభలోనూ మాట్లాడబోతున్నారు.
ఏపీలో అమిత్ షా పర్యటన జనవరి 8న ఒక్కరోజు కొనసాగనుంది. జనవరి 8న కర్నూలుకు చేరుకోనున్న అమిత్ షా, నగరంతో పాటు అనంతరం పుట్టపర్తిలోనూ పర్యటించబోతున్నారు. ఉదయం 11.15కు కర్నూల్లో అమిత్ షా బహిరంగసభ ఏర్పాటు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగే సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. అలాగే ఈ సభ ముగియగానే మధ్యాహ్న భోజనం ముగించుకుని శ్రీ సత్యసాయి జిల్లాలోకి అమిత్ షా అడుగు పెడతారు.
మధ్యాహ్నం 1:30 గంటలకి పార్టీ కార్యకర్తలతో అమిత్ షా భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 3గంటలకి పుట్టపర్తిలో బీజేపీ నేతలతో అమిత్ షా బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం సాయంత్రం 4:30కి పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమాన్ని అమిత్ షా సందర్శించనున్నారు. ఈ తర్వాత పుట్టపర్తిలో సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో అమిత్ షా భేటీ అవుతారు. దీంతో అమిత్ షా టూర్ ముగియనుంది. అనంతరం షా ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోతారు. అసలే ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఓవైపు, ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మరోవైపు సాగుతున్న నేపథ్యంలో షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.