జగన్ నిర్ణయం మంచిదే-సెంటిమెంట్ అర్ధం చేసుకున్నారన్న కిషన్ రెడ్డి- కేంద్రం తరహాలోనే
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని ఏపీలో టీడీపీ, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా స్వాగతిస్తుండగా.. ఇప్పుడు బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా స్వాగతించారు.
ఏపీలో మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకుంటూ ఇవాళ ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు. ప్రజల అభీష్టం మేరకే ఏపీ బీజేపీ అమరావతి రాజధానికి మద్దతుగా నిర్ణయం తీసుకుందన్నారు. రైతుల మేలును దృష్టిలో పెట్టుకునే కేంద్రం రైతు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా సాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు బీజేపీ మద్దతు నిచ్చింది. నిన్న అమరావతి రైతుల్ని నెల్లూరు జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో కలిసిన బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఇది జరిగిన 24 గంటల్లోనే వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో బీజేపీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే బీజేపీ నేతలు పరస్పరం ఫోన్లు చేసుకుని హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఒకప్పటి టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారి ప్రభావంతోనే అమిత్ షా అమరావతికి సానుకూంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయం కూడా వారికి కలిసి రానుంది.












Click it and Unblock the Notifications