నాటి ధరలతోనే 100 శాతం నిధులిస్తాం: పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రమంత్రి ప్రకటన
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిధుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీనిచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.11,600.16 కోట్లు రీఎంబర్స్ చేశామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. మరో రూ. 256 కోట్ల బిల్లులను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి అందజేసిందని పేర్కొంది. త్వరలో వీటిని కూడా విడుదల చేస్తామని తెలిపింది.
టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ కాంపోనెంట్కు 2014 నాటి ధరల ప్రకారం 100శాతం నిధులను ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని పునరుద్ఘాటించారు.

మరోవైపు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా నిధుల్లో గతంలో కోత పెట్టిన తాగునీటి విభాగం నిధులు ఇచ్చేందుకు కేంద్ర జల్శక్తి శాఖ అంగీకరించిన విషయం తెలిసిందే. మినహాయించిన రూ.4,068.43 కోట్లు తిరిగి ఇచ్చేందుకు సమ్మతించినట్లు పోలవరం అధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని జల్శక్తి శాఖ కేంద్ర ఆర్థికశాఖకు కూడా నివేదించినట్లు సమాచారం. ఈ ఫైలు పరిష్కార దిశలో ఉందని జలవనరులశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
2020 అక్టోబరు నుంచి పోలవరం నిధులపై పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఒక లేఖ రాసింది. 2014 ఏప్రిల్ 1 నాటికి సాగునీటి విభాగం కింద పోలవరం ప్రాజెక్టుకు మొత్తం రూ. 20,398.61 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటికి ఈ నిధుల్లో ఇవ్వాల్సింది రూ.15,667.90 కోట్లుగా లెక్క గట్టారు. అప్పటికే రూ.8,614.16 కోట్లు ఇవ్వగా.. ఇక పోలవరానికి ఇవ్వాల్సింది రూ.7,053 కోట్లేనని తేల్చారు. పోలవరం డీపీఆర్ 2 ఆమోదించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్న క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ ఈ లేఖ రాయడంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఇక 2013 14 ధరల ప్రకారం అంచనాలు ఆమోదిస్తూనే.. కొత్త డీపీఆర్ ప్రకారం నిధులివ్వకపోతే ప్రాజెక్ట్ పూర్తి చేయడం సాధ్యం కాదని గతేడాది నవంబరు 2న నిర్వహించిన సమావేశంలో పోలవరం అథారిటీ స్పష్టం చేసింది. అప్పటి నుంచి కొత్త డీపీఆర్ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విభాగాల వారీగా చూసి నిధులు కోత పెట్టడం సరికాదని రాష్ట్రం చాలా సార్లు కేంద్రానికి లేఖలు రాసింది. తాగునీటి విభాగం కింద 2014 ఏప్రిల్ 1 లెక్కల ప్రకారం కోత పెట్టిన రూ.4068 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర జల్శక్రీ శాఖ అంగీకారం తెలియజేసి ఫైలు ఆర్థికశాఖకు పంపినట్లు తెలిసింది. మరోవైపు రూ.47,725.74 కోట్ల డీపీఆర్ 2కు పెట్టబడి అనుమతులు రావాలి. దీనిపై పోలవరం అథారిటీ కొర్రీలు వేయగా జలవనరుల శాఖ అధికారులు సమాధానాలు పంపారు. ప్రస్తుతం రూ.419.90 కోట్ల నిధులకు సంబంధించిన ఫైల్ అన్ని ఆమోదాలు పొందింది. ఆ నిధులు రావాల్సి ఉన్నాయి. 2022-23 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. .












Click it and Unblock the Notifications