టీడీపీతో పొత్తులపై సస్పెన్స్: బీజేపీ కోర్ కమిటీలో తేల్చేస్తారా?
TDP BJP alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీనీ చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు.
అటు జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనలేమంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో తేల్చేశారు. బీజేపీతో మితృత్వం కొనసాగిస్తూనే.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఉమ్మడిగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నారు.

బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీడీపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. బహిరంగంగానే ఆమె పొత్తు వ్యాఖ్యలు చేశారు. రోజులు గడుస్తున్నప్పటికీ.. టీడీపీ-బీజేపీ పొత్తుల వ్యవహారం మాత్రం కొలిక్కి రావట్లేదు. ఎటూ తేలట్లేదు.
టీడీపీ- బీజేపీ పొత్తు కుదిరిందంటూ గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ- జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలను కేటాయించాల్సి ఉంటుందని చంద్రబాబు నిర్ణయించారని, ఇందులోనే బీజేపీ-జనసేన పంచుకోవాల్సి ఉంటుందనేది ఆ కథనాల సారాంశం. కారణాలేమైనప్పటికీ- అవి వాస్తవ రూపాన్ని దాల్చలేకపోయాయి. పొత్తుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వస్తోంది.

ఈ పరిస్థితుల మధ్య- ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. విజయవాడలో ఏ భేటీ ఏర్పాటైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్- దీనికి హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజన చౌదరి, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పదాధికారులు ఇందులో పాల్గొన్నారు.

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా లోక్సభ స్థానాలు, అసెంబ్లీల్లో అభ్యర్థుల ఎంపిక, సామాజిక వర్గాల సమీకరణ వంటి అంశాలపై చర్చిస్తారు. ఇదే సమావేశంలో టీడీపీతో పొత్తులపైనా ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications