సమైక్యవాదాన్ని ఎలుగెత్తిన విజయవాడ సభ
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సమైక్య నినాదాన్ని ఎలుగెత్తి చాటింది. వక్తలు సమైక్యం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తాము మద్రాసును వదిలేశామని, కర్నూలును వదిలేశామని, ఇప్పుడు హైదరాబాదును వదిలేయాలంటున్నారని వక్తలు అన్నారు. తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టే కుటిల యత్నాలను అడ్డుకుందామని చలసాని శ్రీనివాస్ అన్నారు. సోనియా గాంధీ ఇంటి ముందు ఆందోళనలకు దిగాలని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియతో ముందుకు వెళ్తుంటే సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నాటకాలు ఆడుతున్నారని జంధ్యాల రవి శంకర్ విమర్శించారు. ఎన్నో ఉద్యమాలు చేసి రాష్టర్ సమైక్యతను కాపాడుకుంటున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర రాజకీయ నాయకుల బలహీనత వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. ముల్కీ నిబంధనలను అమలు చేసి హైదరాబాదులో ద్వితీయ శ్రేణి నాయకులుగా చేశారని ఆయన అన్నారు.

సమైక్య వాదానికి, విభజన వాదానికి మధ్య జరుగుతున్న సంఘర్షణే ఈ ఉద్యమని, ఈ పోరాటంలో సమైక్యవాదమే నెగ్గి తీరుతుందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం విజయవాడలో తలపెట్టిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు పుచ్చలపల్లి సుందరయ్య వేదికగా నామకరణం చేశారు.
కష్ణా జిల్లా సమైక్యాంధ్ర సమితి నేతత్వంలో స్థానిక పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో అనేక లక్షల మంది ప్రజలు రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని కోరారని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన తర్వాతే ఈ మాట చెబుతున్నానని పరకాల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమైక్య గీతాల సీడీని పరకాల ఆవిష్కరించారు.
బహిరంగ సభకు రాష్ట్ర ఏపీ ఎన్జీవో అసోసియేషన్ చైర్మన్ పి.అశోక్బాబు, విశాలాంధ్ర మహాసభ చైర్మన్ నల్లమోతు చక్రవర్తి, ఆంధ్రా మేధావుల సంఘం ఫోరం నాయకులు చలసాని శ్రీనివాస్, న్యాయవాది జంధ్యాల రవిశంకర్లు పాల్గొన్నారు. వీరితో పాటు సాగునీరు తదితర రంగాలకు చెందిన నిపుణులు హాజరయ్యారు. రాష్ట్రం విడిపోతే ఆయా రంగాలు ఎలాంటి ఒడిదుడుకులకు లోనౌతాయో నిపుణులు ప్రత్యేకంగా సభకు వచ్చిన వారికి వివరించారు. విజయవాడలో తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్రలోని 13 జిల్లాల వ్యాప్తంగా సమైక్యవాదులు కదలి వచ్చారు.












Click it and Unblock the Notifications