అవిశ్వాసం: మోడీని గల్లా జయదేవ్ ఇరుకునపడేశారా? ప్రసంగంపై భిన్నవాదనలు
న్యూఢిల్లీ: కీలకమైన అవిశ్వాస తీర్మానం సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగం అందరిని అసంతృప్తికి గురి చేసిందా? కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా మాట్లాడలేకపోయారా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ రోజు ఎంతో కీలకమైనదిగా టీడీపీ నేతలు భావించారు. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు చంద్రబాబు కూడా అధికారులను, నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. నిత్యం సమీక్షలు నిర్వహించారు.
Recommended Video
సభలో టీడీపీXటీఆర్ఎస్: గల్లా 'తెలంగాణ'పై కవిత, సుమన్ ఆగ్రహం, గందరగోళం
అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందనే తెలిసినప్పటి నుంచి చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఎంతో కసరత్తు చేశారు. కానీ అందరూ ఊహించినంత ఆకట్టుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కీలకమైన అంశాన్ని, కీలకమైన అవిశ్వాసం సమయంలో సమర్థవంతంగా వినియోగించుకోలేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ప్రసంగం సమయంలో ప్రధాని మోడీ, బీజేపీ ఇచ్చిన హామీలు, గత ప్రభుత్వం విభజన చట్టంలో చెప్పిన అంశాలను గల్లా ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా అయిదేళ్ల బదులు పదేళ్లు కావాలని బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు. విభజన పాపంలో సగం కాంగ్రెస్తో పాటు బీజేపీకి ఉందని చెప్పారు. విగ్రహాలకు వేలాది కోట్లు ఇస్తున్నారని, కానీ రాజధానికి మాత్రం రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపై వివక్ష చూపిస్తున్నారన్నారు.
అసలు మేం ఎక్కడ యూటర్న్ తీసుకున్నామో చెప్పాలని గల్లా జయదేవ్ నిలదీశారు. ప్రతి యూసీని ఇక్కడ చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవడం నిజం కాదా అన్నారు. రెవెన్యూ లోటుపై కేంద్రం, రాష్ట్రం మధ్య ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయన్నారు.
అయితే గల్లా ప్రసంగం కేంద్రాన్ని ఇరుకున పడేసేలా లేదని, చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు నిత్యం చెప్పే విధంగా ఉందని, అధికార పార్టీని ఇరుకున పడేసేందుకు కావాల్సిన అంశాలు అందులో కనిపించలేదని అంటున్నారు. గల్లా ప్రసంగం తమను ఇరుకునపెట్టేలా లేదని బీజేపీ కూడా భావిస్తోందట.
అయితే, గల్లా ప్రసంగంపై తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సమస్యలను సమర్థవంతంగా సభలో ప్రస్తావించారని చెబుతున్నారు. ఒకటిన్నరకు సభ వాయిదా పడింది. ఆ తర్వాత అవకాశం వస్తే టీడీపీ నేతలు దూకుడు పెంచి బీజేపీని ఇరుకున పెట్టే అంశాలను లేవనెత్తుతారా చూడాల్సి ఉందని చెబుతున్నారు.