ప్రొద్దుటూర్ టిడిపిలో 'వైసిపి' ట్విస్ట్.. ఇదీ విషయం: వరదరాజులు బాబుకు షాకిస్తారా?
ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నిక అంశం రెండో రోజులుగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ప్రిసైడింగ్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు.
కడప: ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నిక అంశం రెండో రోజులుగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ప్రిసైడింగ్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. టిడిపిలోనే రెండు వర్గాలు చైర్మన్ పదవి కోసం కొట్టుకుంటున్నాయి. ఈ రోజు దాకా ప్రేక్షక పాత్ర వహించిన వైసిపి.. ఆదివారం తీవ్రంగా మండిపడింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అయితే ఏకంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగనివ్వడం లేదని, అధికార పార్టీ తీరు సిగ్గుపడే విధంగా ఉందని, చంద్రబాబు, అధికారుల తీరును నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
దౌర్భాగ్యపు సీఎం, రిజైన్ చేస్తున్నా: చెప్పుతో కొట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే
అయితే, ప్రొద్దుటూరు గొడవకు అసలు కారణం ఏమిటనే చర్చ సాగుతోంది. టిడిపిలోనే రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందులోని ఓ వర్గం నేత ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టిడిపిని కూడా వీడవచ్చుననే ప్రచారం సాగుతోంది.
బావమరిదిని గెలిపించుకోవాలని వరదరాజులు రెడ్డి
మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక టిడిపిలో కాక రేపుతోంది. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, లింగారెడ్డి టీడీపీ నుంచి ఇద్దరూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఎన్నికలో వరద రాజులరెడ్డి బావమరిది ఆసం రఘురామి రెడ్డి పోటీకి దిగారు. అతనిని ఎలాగైనా గెలిపించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
లింగారెడ్డి వర్గీయుడు ముక్తియార్.. పోటాపోటీ
లింగారెడ్డి వర్గం విషయానికి వస్తే.. ఈ వర్గం నుంచి ముక్తియార్ పోటీకి దిగారు. ముక్తియార్ ఇటీవల వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఇరువురి మధ్య పోటీ నెలకొంది.
వైసిపి మద్దతుతో ముక్తియార్ గెలుపు ఖాయమైంది కానీ..
ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో 40 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఇరువురి వైపూ 15మంది ఉన్నారని తేలిపోయింది. మిగతా 10మంది కౌన్సెలర్లు వైసీపీకి చెందిన వారు. వీళ్లంతా ఇటీవల వైసీపీని వీడిన ముక్తియార్కే మద్దతిస్తున్నారు. దీంతో లింగారెడ్డి వర్గీయుడు ముక్తియార్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా మ్యాజిగ్ ఫిగర్ 21. లింగారెడ్డి వర్గీయుడు ముక్తియార్కు వైసీపీ మద్దతుతో 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో ముక్తియార్ గెలుపు దాదాపు ఖాయమైంది.
వైసిపి మద్దతు వద్దని..
ఇదిలా ఉంటే వైసీపీ మద్దతుతో గెలవకూడదని, స్వతంత్రంగానే గెలవాలని పలువురు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. అయితే టిడిపి నేత లింగారెడ్డి మాత్రం వైసిపి వారి మద్దతుతో ముక్తియార్ను గెలిపించుకోవాలనుకుంటున్నారు. లింగారెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా మద్దతు ఇస్తున్నారంటున్నారు.
ఇక్కడే చిక్కు
చైర్మన్ పదవిపై ఒప్పందం జరిగింది. ఈ మేరకు ఇప్పుడు వరదరాజులు రెడ్డి బావమరిది రఘురాం రెడ్డికి అవకాశం రావాల్సి ఉందని అంటున్నారు. కానీ తెరపైకి వైసిపి నుంచి వచ్చిన ముక్తియార్ వచ్చారు. ఇది వరదరాజులు రెడ్డికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. ఈ కారణంగానే రెండు రోజులుగా చైర్మన్ పదవి ఎన్నికను అడ్డుకుంటున్నారని చెబుతున్నారు.
వరదరాజులు రెడ్డి టిడిపిని వీడుతారా?
తమ వర్గీయుడికి లింగారెడ్డి వర్గీయులు అడ్డుపడుతున్న నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇంచార్జిగా రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. బావమరిదిని గెలిపించుకోకపోతే నియోజకవర్గంలో పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని భావిస్తున్నారని చెబుతున్నారు.