తిరుపతికి కదలివచ్చిన అష్టలక్ష్ములు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 65,234 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 26,133 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం నాడు తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారికి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగారు. నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులను కటాక్షించారు.
ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారు ఆశీనులైన బంగారు రథానికి దారి పొడవునా హారతులు పట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు. నాలుగు మాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
టీటీడీ నాద నీరాజనం ప్రాజెక్ట్ కు చెందిన కళాకారులు.. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ కళారూపాలను వారు ప్రదర్శించారు. ఆది లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి రూపంలో దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవంలో ఈవో శ్యామల రావు దంపతులు పాల్గొన్నారు.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు.
అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు.

అకట్టుకున్న వ్రత మండపం
టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 40 మంది సిబ్బంది, 3 టన్నుల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల 30 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఇందులో బత్తాయి, ఆపిల్ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పైభాగంలో గజ లక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాత విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.












Click it and Unblock the Notifications