పనామా దుమారం: 'లిస్ట్లో బాబు పేరు!', 'ఏడాదిలో ప్రభుత్వాన్ని కూల్చుతాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు సంచలన ఆరోపణలు చేసింది. వైసిపి నేత వాసిరెడ్డి పద్మ సీఎంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పనామా పేపర్స్ సంచలనం రేపుతోంది.
500 మంది నల్లధనం ఉన్న భారతీయుల పేర్లను పనామా పేపర్స్ వెల్లడించాయి. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విదేశాల్లో నగదు దాచుకున్న వారి పేర్లను బహిర్గతం చేస్తున్న 'పనామా పేపర్స్'లో ఏపీ సీఎం చంద్రబాబు పేరు త్వరలో వస్తుందని జోస్యం చెప్పారు. బాబు విదేశాల్లో ఆస్తులను దాచాడన్నది అందరికీ తెలిసిన సత్యమని, నల్లధనం దాచుకున్న వారిపై కేంద్రం విచారణ జరిపితే, ఆయన పేరూ బయటకు వస్తుందన్నారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలు కావాల్సిన అవసరం ఉందన్నారు. గతంలోనే చంద్రబాబు అవినీతిని తెహల్కా బయట పెట్టిందని గుర్తు చేసిన ఆమె, ఆయన పాపాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులపై బాబు అభిప్రాయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతాం: చింతా మోహన్
టిడిపి, బిజెపికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేత చింతా మోహన్ వేరుగా అన్నారు. ఇందుకోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను, వైసిపి అధినేత జగన్ను కలుస్తామన్నారు. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ఏడాదిలోపు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పారు.