వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెంచు మహిళల సొమ్ము:దిగమింగిన వెలుగు సిబ్బంది...రూ.72 లక్షలు స్వాహా...అంతా గప్ చుప్

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

ప్రకాశం:కంచే చేను మేసిన చందంగా నిరక్షరాస్యులకు అండగా నిలబడి ఆర్థికాబివృద్దికి తోడ్పడాల్సిన ప్రభుత్వ అధికారులే అక్రమాలకు తెరతీసి చెంచు మహిళలకు చెందాల్సిన సొమ్ము గుట్టు చప్పుడు కాకుండా స్వాహా చేశారు.

చదువు లేని పొదుపు మహిళలతో తీర్మానాలు, అక్రమంగా సంతకాలు చేయించి బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేసుకున్నారు. ఇలా పది...ఇరవై కాదు...ఏకంగా రూ. 72 లక్షలకు పైగా దిగమింగారు. అడిగేవారు లేరనే ధీమాతో ఎవరికి వీలైనంత వారు దండుకున్నారు. ఇలా వీరి బారిన పడి పుల్లలచెరువు, పెదదోర్నాల, యర్రగొండపాలెం మండలాల్లో అత్యధికంగా చెంచు మహిళలు మోసపోయినట్లు తెలిసింది.

 Velugu staff has commited big scam in Prakasam district

నిరుపేదలైన పొదుపు మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు తీసుకురావాలనే మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం వెలుగు వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చింది. అయితే మహిళల్లో పొదుపు చైతన్యం, ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటును అందించాల్సిన వెలుగు సిబ్బందే అందుకు తూట్లు పొడుస్తున్న వైనం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. ఇలా 17 మంది వెలుగు సిబ్బంది నిబంధనలను తోసిరాజని పుల్లలచెరువు, దోర్నాల, యర్రగొండపాలెం మండలాల్లో చెంచు సమాఖ్యల్లోని సొమ్మును నేరుగా వారి పేరుతో చెక్కులు రాయించుకొని స్వాహా చేసేశారు.

ఇలా మొత్తం రూ. 72 లక్షలు దారి మళ్లినట్లు తెలియగా అందులో ఏపీఎం డి.పోలయ్య రూ.32 వేలు, ఏపీఎం పి.ఎడ్వర్డ్‌ రూ.71,729, పెదదోర్నాల సీవీ కె.సుబ్బాయమ్మ రూ.2.20 లక్షలు, సీసీ కృష్ణమోహన్‌ రూ.83,806, సీసీ బాబురావు రూ.20 వేలు, సీసీ పోతురాజు రూ.11,310, సీవీ శ్రీనివాసులు రూ.59,525, సీవీ టి.రమణయ్య రూ.20 వేలు, సీసీ బి.దండయ్య రూ.15 వేలు, ఇలా మరో ఎనిమిది మంది కలిసి మొత్తంగా రూ.8.69 లక్షలు వారి పేర్లతోనే తీసుకొని కాజేసినట్లు బైటపడింది. ఇలా వీరు ఈ సొమ్మును ఎందుకు తీసుకున్నారో లెక్కచెప్పకపోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

మరికొన్ని చోట్ల గ్రామాల్లోని మహిళలకు శిక్షణలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు దస్త్రాలు సృష్టించి ఖర్చులు చేసినట్లు నకిలీ బిల్లులతో పెద్ద మొత్తంలో సొమ్ము దిగమింగారు. ఆమ్‌ఆద్మీ బీమా, అభయహస్తం పథకం పునరుద్ధరణ లక్ష్యాల కోసం సమాఖ్యలోని సొమ్మును బీమా సంస్థకు చెల్లించారు. లబ్ధిదారుల నుంచి వసూళ్లు చేసిన నేరుగా జేబుల్లోకి వేసుకున్నారు. ఇలా శ్రీవెంకటేశ్వర మహిళా గ్రామైఖ్య సంఘం నుంచి రూ.12.51 లక్షలు, శ్రీ శ్రీనివాస మహిళా గ్రామైక్య సంఘం నుంచి రూ.8.86 లక్షలు, చింతల పెద్దమ్మతల్లి మహిళా గ్రామైక్య సంఘం నుంచి రూ.18.89 లక్షలు, శ్రీ సీతారాములు మహిళా గ్రామైక్య సంఘం నుంచి రూ.12.20 లక్షలు, ధనలక్ష్మి మహిళా గ్రామైక్య సంఘం నుంచి రూ.1.50 లక్షలు, భాగ్యలక్ష్మి మహిళా గ్రామైక్య సంఘం నుంచి రూ.రెండు లక్షలు, భ్రమరాంబ మల్లికార్జున మహిళా గ్రామైఖ్య సంఘం నుంచి రూ.16.10 లక్షలు వెలుగు సిబ్బందిని కాజేసినట్లు తెలిసింది.

అయితే ఈ అక్రమాత గురించి శాఖాపరంగా బైటపడి విచారణకు ఆదేశించగా పెదదోర్నాల మండలం చెంచు సమాఖ్యలో మండల సమాఖ్య సీసీగా పనిచేస్తున్న పి.వెంకటసుబ్బమ్మబాయ్‌ తాను రూ.1.50 లక్షలు వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నట్లు అంగీకరించారు. విచారణ జరుగుతున్న సమయంలో హడావుడిగా రూ.50 వేలు చెల్లించిన ఆమె మిగిలిన సొమ్ము తన వేతనం నుంచి వసూళ్లు చేయాలంటూ లిఖితపూర్వక ఒప్పంద పత్రాలను అధికారులకు అందజేశారు. ఇలా పలువురి అక్రమాలు బయటపడి ఏడాదిన్నర గడిచినా నేటికీ 17 మంది సొమ్ము తిరిగి చెల్లించలేదు. అయినా అధికారులు మిన్నకుండటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొంతమంది అక్రమార్కులు ఈ అవినీతి బయటకు పొక్కకుండా రాజకీయ నేతల అండదండలతో వారికి సంబంధించిన ఫైళ్లను నొక్కి పట్టించినట్లు విమర్శలు ఉన్నాయి. విచారణ అధికారులుగా నియమితులైన ప్రాంతీయ సమన్వయ కర్తలు డి.సుభాషిణి, ఎస్‌.శ్యామలాదేవి, ఒంగోలు సుధాకర్‌తో పాటు మరో ఆరుగురు డీఎంజీలు క్షేత్రస్థాయిలో గోప్యంగా విచారణ జరిపారు. అక్రమాలు జరిగినట్లు నిర్ధరించి నివేదిక తయారు చేశారు. అక్రమాలు జరిగిన తీరు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి స్టేట్‌మెంట్‌లను సైతం జోడించి 79 పేజీల నివేదికను ఇటీవల సెర్ప్‌ (పేదరిక నిర్మూలన సంస్థ)కు సీఈవో కార్యాలయానికి పంపారు. అవినీతి జరిగిందని తేల్చినా, ఇంత వరకు సిబ్బందిపై ఎటువంటి చర్యలు గాని, సొమ్ము వసూళ్లు చేయడం గానీ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే మూడు మండలాలకు సంబంధించి చెంచు మహిళా సమాఖ్యల విషయంలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని డీఆర్‌డీఏ పీడీ ఎం.ఎస్‌.మురళి తెలిపారు. వీటిపై ఇప్పటికే విచారణ పూర్తిచేసి సంబంధిత నివేదికను సెర్ప్‌కు పంపామని...కానీ ఇప్పటి వరకు నగదు వసూళ్లు కాలేదని, అక్రమార్కులపై ఉన్నతాధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇంత జరిగినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది.

English summary
Prakasam district:Velugu staff has taken advatage of Uneducated women innocence and drawn their lakhs of money from banks. It's not ten or twenty...more than 72 lakhs. This scam has came late in to light.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X