పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వెనిజులా అధ్యక్షురాలు
వెనిజులా బోలీవేరియన్ రిపబ్లిక్ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ ఎలోయినా రోడ్రిగజ్ గోమెజ్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తోన్నారు. అమెరికా సైనికచర్య అనంతరం వెనిజులాలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె ఆ దేశ అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకోవడం, ఆయనను న్యూయార్క్ తరలించడంతో అక్కడి ప్రభుత్వంలో భారీ మార్పులు సంభవించాయి.
అప్పటివరకు వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆమె భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. రెండు రోజుల కిందటే ఢిల్లీకి చేరుకున్నారామె. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు.

తన పర్యటనలో భాగంగా శనివారం రాత్రి ఆమె సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు వచ్చారు. ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా పాదపద్మాల వద్ద నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ప్రశాంతి నిలయం సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జే రత్నాకర్, సభ్యుడు మనోహర్ శెట్టి తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆమె సాయి కుల్వంత్ హాల్కు చేరుకుని, బాబా సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ పవిత్ర మందిరంలో నిశ్చల చింతనతో కొంత సమయం గడిపారు. సత్యసాయి భజన గీతాలాపనలో పాల్గొన్నారు. భజన చేశారు. సత్యసాయి మీద తనకు ఉన్న భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్శన ఆమెకున్న ఆధ్యాత్మిక నిబద్ధతను స్పష్టం చేసింది. బాబా సన్నిధిలో సమయం గడపడం తనకు దక్కిన గొప్ప అవకాశమని చెప్పారు.
భజన హాల్లో జరిగిన కార్యక్రమంలో, భగవాన్ శతజయంతి ఉత్సవాల గుర్తుగా ప్రత్యేక జ్ఞాపికతో ఆమెను సత్కరించారు. ప్రశాంతి నిలయం నుండి తనకు అందిన ఓ ప్రేమపూర్వక కానుకగా అభివర్ణించారు డెల్సీ. గతంలో కూడా ఆమె ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. వెనిజులా అధ్యక్షురాలి హోదాలో రావడం ఇదే మొదటిసారి. బాబా బోధించిన ప్రేమ, శాంతి, నిస్వార్థ సేవా మార్గాల పట్ల తన గాఢమైన ఆరాధనను పునరావృతం చేశారు.












Click it and Unblock the Notifications