మధురమైన క్షణాలు: వెంకయ్య, మోడీ అంటే త్రీడి అని
హైదరాబాద్: అవినీతి, అరాచకత్వం, అత్యాచారాలు, అక్రమాలతో బాధపడుతున్న ప్రజలకు ఎన్నికల్లో వచ్చిన తీర్పుతో విముక్తి లభిస్తుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బిజెపికి సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టిన దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బిజెపి సొంత మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే ఇంతవరకు ఎవరూ నమ్మలేదని.. ఇప్పుడు ప్రజలు రుజువు చేశారని అన్నారు.
మిత్రపక్షాలతో కలిపి 300కు పైగా సీట్లు సాధించిందని ఆయన తెలిపారు. దేశ ప్రజలు నిర్ణయాత్మక తీర్పు వెలువరించారని అన్నారు. దేశాన్ని సమర్థవంతంగా నడిపే బలమైన నాయకత్వం కావాలని ప్రజలు భావించారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన చెప్పారు. మోడీ అంటే త్రీడీ అన్న ఆయన, త్రీడీ గురించి వివరించారు. మోడీ అంటే నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకునే వ్యక్తని.. ధైర్యంగా వ్యవహరించేవారని.. అభివృద్ధి చేయగలిగే వారని చెప్పారు.
అభివృద్ధి కోరుకున్న దేశ ప్రజలు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నాయకత్వానికి పట్టం కట్టారని తెలిపారు. అవినీతి కాంగ్రెస్ పార్టీపై కసిగా ఉన్న ప్రజలు తమ కోపాన్ని తీర్చుకున్నారని అన్నారు. వారసత్వ , అవినీతి కాంగ్రెస్ పాలన అంతం కావాలని ఇచ్చిన నినాదాన్ని ప్రజలు స్వీకరించారని చెప్పారు. తమ మిత్ర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంపూర్ణ మెజార్టీ సాధించడమనేది బిజెపి చరిత్రలో, తమ రాజకీయ జీవితంలో మధురమైన క్షణాలని వెంకయ్య అన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా తమ పార్టీకి చెప్పుకోదగిని స్థానాలు లభించాయని చెప్పారు. కులాలకు, మతాలకు వర్ణాలకు, వర్గాలకు అతీతంగా బిజెపి పార్టీ నిజమైన అఖిల భారత భారత పార్టీగా అవతరించిందని తెలిపారు.
ప్రజల తీర్పు స్వాగతిస్తాం: రఘువీరా, అభినందనలు
సీమాంధ్ర ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో.. రాష్ట్రంలో ఓటమిపాలైందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తానే బాధ్యతగా వహిస్తున్నట్లు చెప్పారు. 25 ఎంపి, 173 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయిన వారందర్నీ అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గెలవకపోయినా ప్రజలకు రక్షణగా ఉంటామని చెప్పారు.
నూతనంగా ఏర్పడబోయే తెలుగుదేశం ప్రభుత్వానికి శుభాకాంక్షులు రఘువీరా రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులో ఓటమి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంతోపాటు పార్టీని పునర్నిర్మించుకుంటామని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం రాష్ట్ర విభజనేనని తెలిపారు.