పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు: వెంకయ్య మాట ఇదీ.. రోజా, శివాజీ, కవిత కూడా...
హైదరాబాద్: ప్రత్యేక హోదాపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కాకినాడ సీమాంధ్ర ఆత్మగౌరవ సభలో శుక్రవారం సాయంత్రం చాలా ఉద్వేగంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. తెలంగాణకు హైకోర్టు ఇవ్వకుండా కేంద్ర అన్యాయం చేస్తోందని అన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు ప్రతిస్పందించారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా కూడా పవన్ కల్యాణ్పై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడారు.
ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ పోరాటం చేయడానికి ముందుకు రావాలని కోరుతూ వస్తున్న సినీ నటుడు శివాజీ కూడా తన ప్రతిస్పందనను తెలియజేశారు. పవన్ తలుచుకుంటే వారంలో ప్రత్యేక హోదా వస్తుందని ఆయన అన్నారు.

చిన్న పిల్లల మనస్తత్వమని రోజా
పవన్ కల్యాణ్ ది చిన్నపిల్లల మనస్తత్వమని రోజా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ ప్రధాని మోడీని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలని సూచించారు. పవన్ కల్యాణ్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టిడిపి, బిజెపి మ్యానిఫెస్టో చూడకుండానే పవన్ అప్పట్లో ఎన్నికల ప్రచారం చేశారా అని రోజా ప్రశ్నించారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో కుళ్లిన పూలు పెట్టిందని రోజా వ్యాఖ్యానించారు.

రాజకీయాలకు భయపడను: వెంకయ్య
పవన్ కల్యాణ్ వ్యాఖ్యాలపై వెంకయ్య నాయుడు ప్రతిస్పందించారు. ప్రత్యేక హోదాపై తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరు ఏదైనా మాట్లాడవచ్చునని, వారికి వాక్ స్వాతంత్ర్యం ఉందని అన్నారు. తాను భయపడి వెనక్కి వెళ్లనని అన్నారు. తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని చెప్పారు. ప్రత్యేక హోదాపై తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రజలకు మాత్రమే సమాధానం ఇస్తా....
తాను ప్రజలకు మాత్రమే సమాధానం ఇస్తానని వెంకయ్య నాయుడు చెప్పారు. ఎపికి కేంద్రం ప్రత్యేక హోదాకు మించిన సాయం చేసిందని, చేస్తుందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు రెండెళ్లలో 800 కోట్ల రూపాయలకు పైగా ఇచ్చిందని, ఎనిమిది మండలాలను తెలంగాణ నుంచి ఎపికి బదలాయించిన విషయంలో తన చిత్తశుద్ధి వెల్లడైందని ఆయన అన్నారు. ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు, వారి సర్టిఫికెట్ తనకు అవసరం లేదని వెంకయ్య నాయుడు అన్నారు.

ఎపికి ప్రాతినిధ్యం వహించడం లేదు: వెంకయ్య
తాను ఎపికి ప్రాతినిధ్యం వహించడం లేదని, అయినా సరే చాలా చేశానని, తానేం చేశానో ప్రజలకు తెలుసునని వెంకయ్య నాయుడు అన్నారు. గతంలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ మాట్లాడుతున్నావేమిటని తనను అడిగినవాళ్లున్నారని, అయినా మాట్లాడానని చెప్పారు. లెక్కకు మించి కేంద్రం ఎపికి సంస్థలను, నిధులను, పథకాలను ఇచ్చిందని ఆయన చెప్పారు. ఎపికి ఇచ్చిన పథకాలు, నిధులు, సంస్థలు గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ రాష్ట్రానికి ఇవ్వలేదని అన్నారు.

అప్పుడెవరు మాట్లాడారు: వెంకయ్య
పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు అప్పుడు మాట్లాడిందెవరని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. అప్పుడు మాట్లాడనివారు ఇప్పుడుపెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారని, ఆ రోజు వీళ్లంతా ఏం చేశారని అన్నారు. ఎపికి తమ ప్రభుత్వం ఏం చేసిందో, ఏం చేస్తుందో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. కేంద్రం ఎపికి 2 లక్షల 20 వేల కోట్లకు పైగా ఇచ్చింది, ఇస్తుందని, వాటిని ఖర్చు చేస్తే ఎపి ముఖ చిత్రమే మారిపోతుందని అన్నారు.

పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు: వెంకయ్య
పదేళ్లు అధికారంలో ఉన్నవారు చేసిందేమిటని వెంకయ్య నాయుడు అడిగారు. తెలంగాణ ఇస్తామని చెప్పి జాప్యం చేసి వేయి మందిని పొట్టన పెట్టుకుందెవరని ఆయన కాంగ్రెసును ప్రశ్నించారు. తాను ఢిల్లీలో ఉండి, మంత్రులందరితో మాట్లాడుతూ ఎపికి కావాల్సినవాటి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నానని, ఈ విషయం అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉండి ఇతర కేంద్ర మంత్రుల చేత సహాయం ఇప్పిస్తున్నానని ఆయన చెప్పారు.

పవన్ కల్యాణ్ డిమాండ్ను స్వాగతిస్తున్నా: కవిత
తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు.. తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఆంశాన్ని శుక్రవారం నాటి కాకినాడ సభలో పవన్ ప్రస్తావించారు. దీనిపై కవిత స్పందించారు. ఇప్పటికైనా కేంద్రం దీనిపై దృష్టి సారించాలని ఆమె కోరారు.

పవన్ తలుచుకుంటే వారం రోజుల్లో వస్తుంది: శివాజీ
బంద్ సందర్భంగా సీపీఐ ఆఫీస్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నటుడు శివాజీ పాల్గొన్నారు. పవన్ తలుచుకుంటే వారంలో ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని హీరో శివాజీ అన్నారు. పవన్ తన శక్తిని కరెక్ట్గా వినియోగించుకోవాలని హీరో శివాజీ స్పష్టం చేశారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications