అలా వెళ్లండి.. వెరీగుడ్: విహెచ్కు సోనియా మెచ్చుకోలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం గురించి వివరించాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎంపి వి హనుమంత రావుకు సూచించారు. బుధవారం సోనియాను కలిసిన విహెచ్ రాష్ట్ర విభజన ప్రక్రియను కొనసాగిస్తున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల్లో తాను చేపట్టిన సోనియా కృతజ్ఞతా యాత్ర వివరాలు చెప్పారు.
ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్లి మన నిర్ణయం గురించి వివరించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్లు చెప్పాలని సూచించినట్లు తెలిసింది. సోనియా తనను వెరీగుడ్ అని మెచ్చుకున్నారని విహెచ్ తెలిపారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, సురేశ్ షెట్కార్, కేంద్రమంత్రి బలరాం నాయక్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
బలవంతంగా కలిసి ఉండాలనటం ప్రజాస్వామ్యం కాదని, తమ రాష్ట్రాన్ని తామే పరిపాలించుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పార్లమెంటులో పార్టీలకు అతీతంగా ఏకమై పోరాటం చేయటం సరికాదన్నారు. టిడిపిసమైక్యాంధ్ర కోసం పోరాడుతోందని, తెలంగాణలో ఆ పార్టీ నాయకుల్ని తిరగనివ్వొద్దని ప్రజల్ని కోరారు.
వైయస్ ఆత్మ క్షోభిస్తుంది: ఎర్రబెల్లి
శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరి వల్ల దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ అంశాన్ని లేవనెత్తింది వైయస్సేనని, ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపింది ఆయనేని, తెరాసతో పొత్తు పెట్టుకొన్నారని గుర్తు చేశారు.